‘సవాల్ విసిరిన కోమటిరెడ్డి ఏంచేస్తారో మరి’

by  |
‘సవాల్ విసిరిన కోమటిరెడ్డి ఏంచేస్తారో మరి’
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: కోమటిరెడ్డి బ్రదర్స్ పిచ్చి మాటలు కట్టి పెట్టాలని, కాంగ్రెస్ పార్టీ ఇక గతమేనని, రాష్ట్రంలో కనుమరుగు అయ్యిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నిక అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. సాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారని, మరి ఆయన ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చూడాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మతిస్థిమితం లేకుండా పోయిందని, బీజేపీ నేతల కోతలు కూడా ఇక ఆగిపోవాలన్నారు.

నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్‌ను ప్రజలు తరిమేశారని, కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను చూసి ప్రజలు ఆ పార్టీని రాజకీయంగా పాతర వేశారని తెలిపారు. ఫ్లోరైడ్ మహమ్మారిని పెంచిపోషించిన నీచులు కాంగ్రెస్ నాయకులని మండిపడ్డారు. జిల్లాను ఏడారి చేసిన చేతకాని నేతలు కాంగ్రెసోళ్లని, అందుకే కాంగ్రెస్‌కు నూకలు చెల్లిపోయాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సభ్యత, సంస్కారం లేకుండా జుగుప్సాకరంగా మాట్లాడరని, దుబ్బాక ఒక్కటి గెలిచి బీజేపీ నేతలు ఎగిరెగిరిపడ్డారన్నారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క సీటు గెలిచి బీజేపీ నేతలు భూమి మీద ఆగలేదని, చిల్లరమల్లరగా మాట్లాడరన్నారు. జానారెడ్డి ఎన్ని అభూతకల్పనలు మాట్లాడిన ప్రజలు నమ్మలేదన్నారు. సాగర్ ప్రజలు విలక్షణ తీర్పునిచ్చి అభివృద్ధి నిరోధకులకు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలని, ఇది టీఆర్ఎస్ చరిత్రాత్మక విజయమని తెలిపారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నన్ను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలని, సీఎం కేసీఆర్ నమ్మకం విజయం సాధించిందన్నారు. సీఎం కేసీఆర్‌కు, సాగర్ ప్రజలకు రుణపడి ఉంటానని, అభివృద్ధి చేసి చూపిస్తామని వివరించారు.



Next Story