‘తెలంగాణ సాహితీ వైభవాన్ని చాటిన వ్యక్తి సురవరం’

by  |
‘తెలంగాణ సాహితీ వైభవాన్ని చాటిన వ్యక్తి సురవరం’
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సాహితీ వైభవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డిని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. శుక్రవారం ప్రముఖ కవి, చరిత్రకారుడు సురవరం ప్రతాప్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఉన్న ప్రతాప్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ జాతి సాహితీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన రాజకీయ, సాంఘీక, సాహిత్య వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని కీర్తించారు. ‘గోలకొండ పత్రిక’ ద్వారా సురవరం తీసుకొచ్చిన జన చైతన్యం స్ఫూర్తిదాయకం అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసి తెలంగాణ సాహితీ వైభవాన్ని నిరూపించిన తెలంగాణావాది సురవరం ప్రతాపరెడ్డి అని తెలిపారు. వచ్చే ఏడాది ప్రతాప్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. సీఎం కేసీఆర్ సురవరం చరిత్రను తెలియజేసేందుకు ఏడాది పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్వహించాలని ఆదేశించారని, కరోనాతో నిర్వహించలేక పోయామన్నారు. వచ్చే ఏడాది ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో కూడా సురవరం చరిత్రను ప్రచురిస్తామని సీఎం తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Next Story