బీజేపీ నాయకులను నమ్మొద్దు.. రైతులను కోరిన మంత్రి అల్లోల

by  |
బీజేపీ నాయకులను నమ్మొద్దు.. రైతులను కోరిన మంత్రి అల్లోల
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బీజేపీ నాయకుల అసత్య ప్రచారాన్ని నమ్మి మోస‌పోవ‌ద్దని మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి రైతులను కోరారు. బుధ‌వారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు యాసంగిలో రైతులు వరి ధాన్యం పండించవద్దని విజ్ఞప్తి చేశారు. వ‌రికి బ‌దులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంట‌ల‌ను వేయాల‌ని సూచించారు. ఓ వైపున యాసంగిలో వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌మ‌ని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే… రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు మాత్రం వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంద‌న్నారు.

తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. రైతుల‌ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. ప్రధాని న‌రేంద్ర మోడీపై ప్రజ‌ల‌కు విశ్వాసం స‌న్నగిల్లింద‌ని, ఆయ‌న చెప్పే మాట‌లను ప్రజ‌లు విశ్వసించ‌డం లేద‌న్నారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమ‌ని, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేప‌థ్యంలోనే సాగు చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. నూత‌న వ్యవ‌సాయ చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన 750 మ‌ది రైతుల‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు. సాగు చ‌ట్టాల ర‌ద్దుపై పార్లమెంట్‌లో చ‌ర్చ జ‌ర‌పాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేసినా.. చర్చ జ‌ర‌ప‌కుండానే నిమిషాల వ్యవ‌ధిలో బిల్లుకు ఆమోదం తెలిపార‌ని బీజేపీ ప్రభుత్వ తీరును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి త‌ప్పుబట్టారు.



Next Story