అక్కడి ప్రజలను.. అప్రమత్తం చేయండి

by  |
అక్కడి ప్రజలను.. అప్రమత్తం చేయండి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నిర్మల్ కలెక్టరేట్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

మరో మూడు, నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నదని, ఈ నేపథ్యంలో అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాల్లో గోదావరి, పెన్ గంగా, ప్రాణహిత నదులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను అంచనా వేసి అందుకు తగినట్టు ఏర్పాట్లు చేసుకోవాలని, నాలుగు జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, సేగ్రిగేషన్ షెడ్లు, రైతు వేదికల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, కల్లాల ఏర్పాట్లను పూర్తి చేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అటవీశాఖ అధికారి డాక్టర్ సుతాన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed