మౌలిక వసతులపై దృష్టి సారించాలి : కేటీఆర్

by  |
మౌలిక వసతులపై దృష్టి సారించాలి : కేటీఆర్
X

దిశ, నల్లగొండ: మున్సిపాలిటీల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. నల్లగొండ జిల్లా పరిధిలోని పురపాలక సంఘాలపై మంత్రి కేటీఆర్ గురువారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డితో పాటు నల్లగొండ జిల్లా పరిధిలోని స్థానిక ఎమ్మెల్యేలు, పురపాలక సంఘాల చైర్ పర్సన్లు, పురపాలక సంఘాల కమిషనర్లు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఈ సమీక్షలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. పురపాలక సంఘాల పరిధిలోని పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి కనీస అవసరాల పైన ప్రధాన దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను తూచా తప్పకుండా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పురపాలక సంఘాలకు గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకొని పట్టణాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టణాల్లో తీసుకోవాల్సిన కార్యక్రమాలపైన పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పనులు పూర్తి చేసే దిశగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు ఆయన పురపాలిక వారీగా ఉన్న అవసరాల మేరకు స్వచ్ఛ వాహనాలను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ప్రతి పట్టణంలో అవసరమైన మేరకు టాయిలెట్ల నిర్మాణం, బస్ బేల నిర్మాణం నిర్మాణం వంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టాలన్నారు. ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో పట్టణాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే కూల్చివేయాలని ఇలాంటి చోట్ల ప్రమాదాలు జరిగితే స్థానిక చైర్మెన్, కమిషనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈనెల 29న నల్లగొండ జిల్లా పర్యటన చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి బాట పట్టించేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలకు పురపాలక శాఖ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.



Next Story

Most Viewed