ఒమిక్రాన్‌తో గాబరా వద్దు.. మంత్రి హరీష్ సూచనలు

by  |
ఒమిక్రాన్‌తో గాబరా వద్దు.. మంత్రి హరీష్ సూచనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కూడా కంట్రోల్‌లోనే ఉన్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కానీ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, కొవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. టీనేజ్ యువతకు జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతున్నందున ఆ ప్రక్రియపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హెల్త్ కేర్ వర్కర్లకు, వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు జనవరి 10 నుంచి ఇవ్వాల్సిన బూస్టర్ డోస్‌పైనా ఆయన రివ్యూ చేశారు. మొత్తంగా 70 లక్షల డోసులు అవసరమవుతాయని, వాటిని సిద్ధం చేసుకోవడంపై తగిన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితి, ఒమిక్రాన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఎంసీఅర్‌హెచ్ఆర్‌డీలో వైద్యాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించిన సందర్భంగా పై అంశాలను వివరించారు.

వివిధ దేశాల్లో, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మొదటి డోసు దాదాపుగా వంద శాతానికి చేరుకుంటున్నదని, ఇదే స్ఫూర్తితో రెండో డోసును కూడా పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. 15- 18 ఏళ్ల వయస్సు వారికి ఫస్ట్ డోసు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు మూడో డోసు (బూస్టర్ డోస్) ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినందున ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలన్నారు.

జాతీయ స్థాయిలో మొదటి డోసు సగటు 90 శాతం ఉంటే, తెలంగాణలో 99.46 శాతానికి చేరుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15-18 ఏండ్ల వయస్సు వారు 22.78 లక్షల మంది, 60 ఏళ్ల పైబడినవారు 41.60 లక్షలు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లు 6.34 లక్షల చొప్పున ఉన్నారని, వీరందరికీ దాదాపుగా 70 లక్షల వ్యాక్సిన్ అవసరం ఉంటుందని అంచనా వేశారు. జనవరి 3 నుండి 15-18 వయస్సు వారికి, జనవరి 10 నుండి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను విభాగాల వారీగా సమీక్షించి లోపాలుంటే సరిదిద్దుకోవాలని సూచించారు. అవసరమైతే అదనపు చర్యలూ తీసుకోవాలన్నారు.

Next Story

Most Viewed