'రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ స్కీం వరం లాంటిది'

by  |
రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ స్కీం వరం లాంటిది
X

దిశ సిద్దిపేట: రజకుల లాండ్రీ షాపులు, దొబీ ఘాట్ లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్తును అందించే స్కీమ్‌ వరం లాంటిదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. మంగళవారం కలెక్టర్ మీటింగ్ హల్‌లో నాయి బ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్ పథకంపై జిల్లా కలెక్టర్, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమీక్షించారు. సెలూన్ లకు ఉచిత విద్యుత్ కోసం నాయి బ్రాహ్మణులు 547 దరఖాస్తులు, దోబీ ఘాట్, లాండ్రీలకు ఉచిత విద్యుత్ కోసం రజకులు 280 దరఖాస్తులు ఇప్పటి వరకు సమర్పించారని, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సరోజ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇంకా దరఖాస్తుల సమర్పణకు తుది గడువును ప్రభుత్వం నిర్ధారించలేదని ఆమె తెలిపారు. జిల్లాలోని రజక, నాయీబ్రాహ్మణ కమ్యూనిటీలలోని అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చైతన్యం చేస్తున్నామని ఆమె మంత్రికి తెలిపారు.

వచ్చిన దరఖాస్తుదారుల వివరాలు పేర్కొంటూ జిల్లా కలెక్టర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈకి లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు. నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే చెల్లించనున్నందున వారికి కరెంట్ కట్ చేయవద్దని లేఖలో స్పష్టం చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ… నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నాయీబ్రాహ్మణులు, రజకుల సౌకర్యార్థం మున్సిపల్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ నిబంధనను మినహాయించిందన్నారు. షాప్ తో పాటు ఇంటి వద్ద పని చేసే రజకులు, నాయీబ్రాహ్మణులకు కూడా ఈ స్కీం వర్తింప చేసిందన్నారు.

రజకుల లాండ్రీ షాపులు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్తును అందించే స్కీమ్‌ కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచడానికి స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని మంత్రి సూచించారు. గ్రామ వార్డు సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లు, ఎంపీపీ లు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్ లు తమ గ్రామాలు పట్టణాల్లో లబ్ధిదారులను గుర్తించి వారంతా సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. తర తరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరనుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ ఉచిత విద్యుత్తు నిర్ణయం ద్వారా వృత్తి దారులకు శారీరక శ్రమ తగ్గి, ఆర్ధిక వెసులు బాటు కూడా కలగనుందనీ అన్నారు. ఇప్పటికి దరఖాస్తు చేసుకొని లబ్ధిదారులు తమ వివరాలను మీసేవా కేంద్రాల్లో వెంటనే నమోదు చేసుకోవాలని మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed