జిల్లాకో మెడికల్​ కాలేజ్​.. మంత్రి హరీష్​రావు ప్రకటన

by  |
జిల్లాకో మెడికల్​ కాలేజ్​.. మంత్రి హరీష్​రావు ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు పేర్కొన్నారు. నూతన మెడికల్ కాలేజీల నిర్మాణంపై మంగళవారం బీ అర్ కే భవన్ లో ఆరోగ్య, అర్ అండ్ బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొత్తగా ఏర్పాటు చేస్తున్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో సహా 8 మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీలను తీర్చిదిద్దాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలన్నారు. స్థలం వృథా కాకుండా, అన్ని వసతులు ఉండేలా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ప్రతి పేద బిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కలను సాకారం చేసేందుకు పనులు వేగం చేయాలన్నారు.

నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో లక్ష్యాన్ని చేరుకుంటున్న నేపథ్యంలో, విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పల్లె దవాఖానల ద్వారా గ్రామీణులకు ఎంబీబీఎస్ వైద్యుల సేవలు, మెడికల్ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతాయన్నారు. దీంతో ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం, ఆపత్కాలంలో వెంటనే నర్శరీ కేర్ సేవలు అందించడం సాధ్యం అవుతుందన్నారు. సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీ ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, సీ ఈ రాజేందర్, ప్రొఫెసర్ విమల థామస్, అర్ అండ్ బీ ఇ ఎన్ సి గణపతి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed