ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి హారీశ్ రావు..

by  |
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి హారీశ్ రావు..
X

దిశ, సిద్దిపేట : హామీలు ఇవ్వడమే కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎల్లప్పుడూ ముందుంటారు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది. చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 09 ఆగస్ట్ 2021 తేదీన మంత్రి హరీష్ రావు పర్యటించిన సందర్భంగా జనగామ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మున్సిపాలిటీ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి పై స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి పారుదల, గ్రామీణ తాగునీటి సరఫరా, సబ్‌ డివిజన్‌ కార్యాలయాలు, వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) కార్యాలయాల ఏర్పాటు ఆవశ్యకతను స్థానిక ఎమ్మెల్యే మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి సమీక్షా సమావేశంలోనే వాటి ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో చేర్యాల కేంద్రంగా ఆర్‌డబ్ల్యు‌ఎస్ ఉప కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయంతో పాటు చేర్యాలలో ఇరిగేషన్ సబ్ డివిజన్ ఆఫీస్‌ను యధావిధిగా తీసుకువస్తామని పేర్కొన్నారు.

అవసరమైన నివేదికలు ప్రభుత్వానికి పంపాలని అక్కడి నుంచే సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే చేర్యాల మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామని స్పష్టం చేసారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రద్దు చేసిన నీటి పారుదల, గ్రామీణ తాగునీటి సరఫరా సబ్‌ డివిజన్‌ కార్యాలయాలను ఇటీవలే పునరుద్ధరించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ రెండు కార్యాలయాలు ప్రారంభమై ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. చేర్యాల మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేశారు.

వారంలో ఏడీఏ కార్యాలయం ఏర్పాటుకు అధికారుల కసరత్తు..

ఇటీవల చేర్యాలలో వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) కార్యాలయం మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ మెమో జారీ చేశారు. చేర్యాల మార్కెట్ యార్డు పరిధిలో సహాయ సంచాలకులు (ఏడీఏ) కార్యాలయాన్ని వారం రోజుల్లో ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక సాగునీటి వనరుల లభ్యత జరిగింది. ఫలితంగా కరవు పీడిత ప్రాంతం చేర్యాల సబ్‌ డివిజన్‌ పరిధిలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూల్మిట్ట మండలాల పరిధిలో సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో రైతులకు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు అవసరమయ్యాయి.

వ్యవసాయ సహాయ సంచాలకుల పరిపాలన సౌలభ్యం పెరగడంతో రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వేగంగా అందనున్నాయి. కాగా, జిల్లాలో ఇప్పటికే సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, ములుగు వ్యవసాయ డివిజన్లు ఉండగా.. చేర్యాలలో ఏర్పాటయ్యే ఏడీఏ కార్యాలయంతో ఆ సంఖ్య ఆరుకు చేరనుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాలో కలిసిన చేర్యాల ప్రాంత అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed