’కేసీఆర్‌ పాలనలో వ్యవసాయ రంగానికి గ్లామర్ వచ్చింది‘

by  |
’కేసీఆర్‌ పాలనలో వ్యవసాయ రంగానికి గ్లామర్ వచ్చింది‘
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: సీఎం కేసీఆర్ పాల‌న‌లో వ్య‌వ‌సాయ రంగానికి గ్లామ‌ర్ వ‌చ్చింద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం అబిడ్స్‌లోని రెడ్డి హాస్ట‌ల్‌లో వ్య‌వ‌సాయ అధికారుల ఆధ్వ‌ర్యంలో రూపొందించిన నూత‌న సంవ‌త్స‌రం డైరీ, క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్యక్రమం జ‌రిగింది. ఈ సందర్భంగా మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, హ‌రీష్‌రావులు పాల్గొన్నారు. అనంతరం నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ… గతంలో వ్యవసాయ శాఖకు అంత‌గా ఆదరణ లేదని అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్య‌తలు చేప‌ట్టిన అనంత‌రం ప్రత్యేక శ్రద్ధతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ది చేశారని కొనియాడారు.

అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… త‌న‌కు వ్యవసాయ శాఖను చూసినప్పుడల్లా ఆనందం కలుగుతుందన్నారు. ఈ శాఖలో అధికారులు రిటైర్డు అయిన తర్వాత కూడా సర్వీసులో ఉన్న అధికారులతో కలిసి పనిచేస్తారని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం విజయవంతం అయ్యేందుకు కారణం పదవీ విరమణ చేసిన వ్యవసాయ అధికారులే అని ప్ర‌శంసించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వన్నెతెచ్చిందన్నారు. దేశంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు న్యాయం చేయాలని కోరినా పట్టించుకోలేదని, నేడు రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ, రైతుబంధు ఇస్తున్నామ‌ని గ‌ర్వంగా చెబుతున్నామ‌న్నారు. మనందరం రైతు సేవకులం, మీరు అధికారులైనా, మేము మంత్రులమైనా రైతుల సేవకోసమే అని హ‌రీష్ రావు అన్నారు.



Next Story