పూటకో పుకారు… గంటకో అబద్ధం

by  |
పూటకో పుకారు… గంటకో అబద్ధం
X

దిశ ప్రతినిధి, మెదక్: బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, భారతీయ ఝటా పార్టీ అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం సిద్దిపేటలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న గోబెల్ ప్రచారాలపై విరుచుకు పడ్డారు. వెయ్యి అబద్దాలు ఆడైనా దుబ్బాకలో బీజేపీ గెలవాలని చూస్తోందని అన్నారు. పూటకో పుకారు పుట్టించి, గంటకో అబద్ధం ఆడటమే బీజేపీ నైజం అని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకొని గ్రామస్థాయి వార్డు నాయకుని వరకూ అందరూ అబద్ధాలు ఆడేవారేనని అన్నారు.

బీడీ కార్మికుల పెన్షన్ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సవాల్ విసిరితే తోక ముడిచారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలకు రెండువేల పెన్షన్ అందిస్తుందని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ పథకంలో కేంద్రానిది నయా పైసా లేదని స్పష్టం చేశారు. గొర్రెల యూనిట్లలో బీజేపీ రూ.50 వేలు నూటికి నూరుశాతం అబద్ధమని, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు.

పాలిటెక్నిక్ కాలేజ్‌కు దుబ్బాకలో శంకుస్థాపన జరిగాక సిద్దిపేటకు తరలించారని గోబెల్ ప్రచారం చేస్తున్నారని, అసలు పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు కాలేదని తెలిపారు. కేసీఆరే మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నాడని మరో అబద్ధపు ప్రచారానికి బీజేపీ తెరలేపిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచిన చోట, వాళ్లు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. గెలిస్తే పసుపుబోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఎంపీ ఇంకా పసుపు బోర్డు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. అబద్దాలకు ఆస్కార్ అవార్డు గనుక ఉంటే అది ఖచ్చితంగా బీజేపీకే దక్కుతుందని అభిప్రాయపడ్డారు.

Next Story