బ్యాంకర్లకు మంత్రి హరీష్ రావు కీలక ఆదేశం

by  |
బ్యాంకర్లకు మంత్రి హరీష్ రావు కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు నిధులను రైతులు విత్ డ్రా చేయడానికి ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బ్యాంకర్లకు ఆదేశించారు. కొన్ని బ్యాంకులు విత్ డ్రాలకు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. మంగళవారం బీఆర్‌కే భవన్ లో బ్యాంకర్లతో మంత్రి హరీష్ రావు అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి నిలిపివేతలు చేపట్టవద్దని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన, సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు వెంటనే జమ చేయాలన్నారు. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జిల్లా స్థాయిలో పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుందని వివరించారు.

రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లు 18002001001, 04033671300 ఏర్పాటు చేసిందన్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పంట రుణాల రెన్యూవల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతుబంధు నిధులను నిలిపివేయడానికి బ్రాంచ్ మేనేజర్లకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం నటరాజన్, బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎం మన్మోహన్ గుప్తా, ఎస్‌ఎల్‌బీసీ డీజీఎం శేష్ కుమార్ ఆదిరాజు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం షేక్ హుస్సేన్, కెనరా బ్యాంక్ డీజీఎం ఎస్‌.వి.జె. వేణు గోపాల్, సీఎస్ సీఏబీ ఎండి మురళీధర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎజిఎం ఆర్.వి.శారద, ఏపీజీవీబీ జీఎం పార్థసారధి, టీజిబీ జీఎం సతీష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed