మీటర్లు పెట్టే బీజేపీని బొందపెట్టాలి : హరీష్‌రావు

by  |
మీటర్లు పెట్టే బీజేపీని బొందపెట్టాలి : హరీష్‌రావు
X

దిశ ప్రతినిధి, మెదక్: బావికాడ మోటర్లకు మీటర్లు పెట్టే బీజేపీని దుబ్బాక ఉపఎన్నికల్లో బొంద పెట్టాలని రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా అప్పనపల్లి, హసన్ మీరాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా చేగుంట మండల కేంద్రంలో టీ ఆర్‌ఎస్‌కు మద్దతుగా రైతులు భారీ బహిరంగ సభ నిర్వహించగా.. దానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బావికాడ మీటర్లు పెట్టేందుకు బీజేపీకి ఓటెయ్యాలా.. అర్ధరాత్రి కరెంటు ఇచ్చే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలా.. ఉచిత కరెంటు ఇచ్చే టీఆర్ఎస్‌కు ఓటేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లు నమూనాను 27 ఏప్రిల్ 2020న రాష్ట్రాలకు పంపిందన్నారు.

17 మే 2020న కేంద్రం మరో లేఖ రాసింది. బావిలకాడ మీటర్లు పెట్టి, రైతుల చెతుల్లో బిల్లు పెడితే రూ.2500 కోట్లు ఇస్తామని లేఖలో పేర్కొందని చెప్పారు. సీఎం కేసీఆర్ 2 జూన్ 2020న మేం ఉచిత కరెంటు ఇస్తాం.. రూ.2500 కోట్లు వద్దు, మేం రైతుల బావులకు, బోర్లకు మీటర్లు పెట్టమని కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. బీజేపీ వాళ్లు వచ్చి సీసాలు ఇస్తున్నారని.. సీసాలు కావాలా.. కాళేశ్వరం నీళ్లు కావాలో మీరే తేల్చుకోవలన్నారు. బీజేపీ వాళ్లు విదేశీ మక్కలు తెచ్చి మన కోళ్లకు పోస్తారంట.. మన మక్కల సంగతి ఏంటని ప్రశ్నించారు.

పెన్షన్లు మేమే ఇస్తున్నామని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. రుజువు చేయమని సవాల్ విసిరితే.. సల్లగా జారుకున్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ పలకరించిన పాపాన పోలేదని.. కానీ, రైతు మరణించిన 5 రోజుల్లోపు రూ.5 లక్షలు ఇచ్చి టీఆర్ఎస్ భరోసా కల్పిస్తుందని వివరించారు. దుబ్బాక ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని, మీ కోసం నా ఇంటి తలుపులు ఎప్పటికీ తెరిచే వుంటాయని మంత్రి భరోసానిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed