‘దుబ్బాక ప్రజల్లారా ఆలోచించండి.. మీ ఓటు ఎవరికి’

by  |
‘దుబ్బాక ప్రజల్లారా ఆలోచించండి.. మీ ఓటు ఎవరికి’
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ప్రజలకు అన్నం పెట్టే వాల్లు కావాలా.. ఆగం చేసే వాళ్లు కావాలా అంటూ మంత్రి హారీశ్ రావు వ్యాఖ్యానించారు. రైతుబంధువులు కావాలా.. రాబంధులు కావాలా అంటూ ప్రజలను అడిగారు. కేవలం ఓట్లు ఉన్నప్పుడు ఎన్నికల కోసం వచ్చే వారు కావాలా..? ఇది ఒక సారి ఆలోచించండి అంటూ ప్రజలకు సూచించారు. దుబ్బాకలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఇప్పటివరకు మాట్లాడిన పరాయి నేతలు రేపు ఉండరన్నారు.

ప్రజలకు రైతు బంధు ఇచ్చింది ఎవరు?.. కళ్యాణ లక్ష్మీ ఇచ్చింది ఎవరు?.. కేసీఆర్ కిట్ ఇచ్చింది ఎవరు?.. ఇంట్లో కుళాయి తిప్పితే స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ఇచ్చింది ఎవరు?.. కాళేశ్వరం నీళ్లు తెచ్చింది ఎవరు?.. ఇవ్వన్ని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలన్నారు. ఓటు వేసే ముందు గుండెల మీద చేతులేసుకొని తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాల గురించి ఆలోచించండి అంటూ హరిశ్ రావు సూచనలు చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి 5 పథకాలు ఇస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ అభివృద్ధి లేదనడం సరికాదని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.

బతికుండగా కాళేశ్వరం నీళ్లు తెస్తారా అన్న వారికి బుద్ధి చెప్పేలా నీళ్లు తీసుకొచ్చి దుబ్బాక నెలను తడిపామని హరీశ్ రావు గుర్తు చేశారు. రైతన్న కలను నిజం చేశామన్నారు. అటువంటిది టీఆర్ఎస్‌కు కాకపోతే ఇంకా ఏ పార్టీకి ప్రజలు ఓటు వేస్తారన్నారు. కానే కాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్.. రానే రాదన్న గోదావరి జలాలను తెచ్చారన్నారు. విపక్షాలు, స్వపక్షం అని తేడా లేకుండా అందరికీ సమానం ప్రభుత్వ ప్రతిఫలాలను అందజేస్తున్నామన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకెయ్యాలని ఆయన ప్రశ్నించారు. ఉచిత కరెంట్ ఇవ్వనందుకా.. బావి కాడా మోటర్లు కాల్చినందుకు ఓట్లు వేయాలా అంటూ ప్రశ్నలు వేశారు. 50 ఏండ్ల కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేసిందో.. 5 ఏండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అన్న మనసాక్షితే రేపు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed