క్యాంపుల్లో కౌన్సిలింగ్.. గంగుల, కౌశిక్ రెడ్డి మార్క్..!

by  |
క్యాంపుల్లో కౌన్సిలింగ్.. గంగుల, కౌశిక్ రెడ్డి మార్క్..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను క్యాంపులకు తరలించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులను శనివారం సాయంత్రం క్యాంపులకు తరలించారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన వీరి పర్యటన 12 రోజుల పాటు సాగనుంది. గోవా, బెంగుళూరు, పుణేల మీదుగా సాగుతున్న ఈ క్యాంపుల్లో ఆయా నియోజవకర్గాల ఇన్చార్జిలు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తప్పా వేరే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయవద్దని సూచించారు.

మంత్రి గంగుల…

కరీంనగర్ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలందరితో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంత్రి గంగుల కమలాకర్ సూచన మేరకు తామంతా కూడా గులాబీ అభ్యర్థులకే మద్దతు ఇస్తామని మాట ఇచ్చారు.

కౌశిక్ రెడ్డి..

బెంగుళూరులో ఉన్న హుజురాబాద్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ లీడర్లు సత్తా చాటాలన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరూ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేసి రెండు స్థానాల్లో విజయ ఢంకా మోగించేందుకు తమవంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు.

బీజేపీ, కాంగ్రెస్ వారు కూడా..

టీఆర్ఎస్ పార్టీ జిల్లా నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కేవలం తమ పార్టీకి చెందిన వారినే కాకుండా ఇతర పార్టీల వారిని కూడా క్యాంపులకు తరలించినట్టుగా సమాచారం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన వారిని కూడా కొంతమందిని తీసుకెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా టూర్లకు తీసుకెళ్లారు. దీంతో తమ బలాన్ని మరింత పెంచుకోవాలని జిల్లా టీఆరెఎస్ నాయకులు భావించినట్టుగా తెలిసింది.



Next Story

Most Viewed