మాకు తప్ప.. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఎవరికీ లేదు : గంగుల

by  |
Minister Gangula Kamalakar
X

దిశ, కరీంనగర్ సిటీ: ఎవరెన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని ఆపలేకపోయారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే అభివృద్ధికి దోహదపడ్డాయని అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చిన టీఆర్ఎస్ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తమ బలం, బలగాన్ని తట్టుకోలేక అపవిత్ర కలయికకు శ్రీకారం చుడితే, ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు తిరస్కరించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తప్ప మరే పార్టీకి కూడా ఓటు అడిగే హక్కు లేదని ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైందన్నారు.

అనంతరం ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలే తమ గెలుపు సోపానాలుగా మారాయని, తనపై అవాకులు చవాకులు మాట్లాడిన వారికి తన గెలుపు చెంప పెట్టు అయిందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని, సమస్యలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మరో ఎమ్మెల్సీ ఎలగందల రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ శక్తికి తిరుగులేదని, టీఆర్ఎస్ పార్టీ బలమైందని ఈ ఎన్నికల ద్వారా తేలిపోయిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే తమ పార్టీ అధినేత తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా, ప్రజాసేవ చేస్తామని వెల్లడించారు.


Next Story