6,70,999 మందికి రేషన్ కార్డులు: మంత్రి గంగుల

by  |
Minister Gangula kamalakar
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల కోసం 9,53,394 దరఖాస్తులు అందాయని, అర్హులను గుర్తించి 6,70,999 మందికి నూత‌న రేష‌న్ కార్డులు అందజేశామని, వీటి ద్వారా 21,30,194 మంది ల‌బ్ది పొందుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేష‌న్ కార్డు అందించామ‌ని, అర్హులపై కేంద్రం పరిమితులు విధించినా, ప్రతీ అర్హుడికి రేష‌న్ కార్డు అందజేస్తున్నామన్నారు. 2016లో 94,417 కార్డులు, 3,30,459 లబ్దిదారులు, 2017లో 36,039 కార్డులు, 1,26,136 లబ్దిదారులు, 2018లో 1,65,036 కార్డులు 5,77,626 లబ్దిదారులు, 2019లో 64,471 కార్డులు 2,25,649 లబ్దిదారులు, 2020లో 11 కార్డులు 39 ల‌బ్దిదారులు, 2021లో 3,11,025 కార్డులు 8,70,285 లబ్దిదారులకు అందజేశామన్నారు.

క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థకాల కింద ఇప్పటివ‌ర‌కు 9,31,316 మంది ల‌బ్ది పొందారని, బీసీ సంక్షేమం ద్వారా 4,35,365 మంది, గిరిజ‌న సంక్షేమం ద్వారా 1,11,876 మంది, మైనార్టీ సంక్షేమం ద్వారా 1,95,960 మంది, ఎస్సీ సంక్షేమం ద్వారా 1, 88,212 మంది ల‌బ్ధి పొందారన్నారు. ఈ ప‌థ‌కాల కోసం ఇప్పటి వ‌ర‌కు రూ. 7,720.8 కోట్లు ఖ‌ర్చు చేసినట్లు వెల్లడించారు. క‌రోనా కాలంలో కూడా క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, పథకాల పేరిట మోసాల‌కు పాల్పడుతున్న వారిపై కేసులు న‌మోదు చేశామ‌న్నారు. పథకం కింద ఇస్తున్న సాయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.


Next Story

Most Viewed