మీరు గట్లంటరేందీ…? కేసీఆర్ మహాత్ముడు: మంత్రి ఎర్రబెల్లి

by  |
మీరు గట్లంటరేందీ…? కేసీఆర్ మహాత్ముడు: మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్: ప్రతిపక్షాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతమున్న కరోనా కష్ట కాలములో మాతో కలిసి రావాలి గానీ మమ్మల్ని అడ్డుకోవొద్దంటూ ఆగ్రహించారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరులో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు విలేక‌రుల‌తో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలవి పిచ్చి మాట‌లు.. ప‌చ్చి రాజకీయాలని‌, ఆ పార్టీల నేతలు నైతికత లేకుండా మాట్లాడుతున్నార‌న్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వట్లేదు. ఈ క‌రోనా స‌మ‌యంలో రైతుల పంట‌ల‌ను కొనే దిక్కులేద‌ని ఆయ‌న అన్నారు. ఎక్క‌డైనా ఆ రెండు పార్టీల పాలిత రాష్ట్రాల్లో పంట‌లు కొనుగోలు చేస్తున్నారా? చెప్ప‌మ‌నండి? కరోనా కష్టకాలంలో కూడా రైతులను ఆదుకున్న మహాత్ముడు సీఎం కేసీఆర్ అని ఎర్ర‌బెల్లి అన్నారు. క‌ష్ట‌కాలంలో కూడా రైతుల‌కు అండ‌గా నిలుస్తుంటే కాళ్లల్లో క‌ట్టెలు పెట్టిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశంలోనే కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని, సీఎం చర్యల వల్లనే సాధ్యమైందన్నారు. రైతులను రాజుగా చూడాలనేదే ఆయన ధ్యేయమ‌న్నారు. సాగునీరు, 24 గంట‌ల ఉచిత విద్యుత్, పంట‌ల పెట్టుబ‌డుల రైతు బంధు, రైతు బీమా, పంట‌ల కొనుగోలు, రుణ‌మాఫీ ఇన్ని ర‌కాల ప‌థ‌కాలున్న రాష్ట్రం దేశంలోనే లేద‌న్నారు. సాధ్య‌మైతే మంచి స‌ల‌హాలివ్వాలని ప్ర‌తిప‌క్షాల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి సూచించారు.


Next Story