మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్.. ఇదివరకు ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క..

by  |
మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్.. ఇదివరకు ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క..
X

దిశ, దేవరుప్పుల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు దేవరుప్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ అధ్యక్షతన మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలని అన్నారు. మాటకు మాట సమాధానం చెప్పాలన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదని అన్నారు. ఇదివరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్కా అని అన్నారు. నాయకుల, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవ్వరు మాట్లాడినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు ఎవరైనా పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఏడేండ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మరే రాష్ట్రం సాధించని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపుతున్నారన్నారు. ఈ తరుణంలో ప్రతిపక్ష పార్టీలకు స్థానం దొరకడం కస్టమని తెలిసి బురదజల్లే మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ఇతర ఏ రాష్ట్రంలో ఆలోచన చేయని, సాధ్యంకాని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ సంస్థాగత కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని, గ్రామ, మండల కమిటీలే పార్టీకి పునాదులని అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం అహర్నిశలు కష్టపడాలని అన్నారు. పార్టీలో పదవులు రాని వారు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. వచ్చే సీజన్‌లలోనైనా దొడ్డురకం వరి పండించడం మానేయాలని, కేంద్రప్రభుత్వం ధాన్యం కొనే పరిస్థితుల్లో లేదని వరి ధాన్యం కాకుండా ఫామాయిల్, వేరుశనగ, కూరగాయలు తదితర పంటలపై రైతులు దృష్టి సారించాలని అన్నారు. త్వరలో మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మించబోతున్నామని తెలిపారు.

మండల అధ్యక్షునిగా తీగల దయాకర్ ఎన్నిక

మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నూతన మండల అధ్యక్షునిగా తీగల దయాకర్, ప్రధాన కార్యదర్శిగా చింతా రవి లను ఏకగ్రీవంగా ప్రకటించారు. మండల అధ్యక్షుడు బరిలో నలుగురు పోటీ పడగా అందరితో మాట్లాడి ఏకాభిప్రాయం చేసినట్లు తెలిపారు. మిగతా అభ్యర్థులను భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు జన్ను జకారియా, గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రాంరెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేష్ రెడ్డి, మేకపోతుల ఆంజనేయులు, డాక్టర్ రామనర్సయ్య, కోతి ప్రవీణ్, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, మొలుగూరి రమేష్, కొల్లూరు సోమన్న, జోగు సోమనర్సయ్య, కోతి పద్మ, ఆలకుంట్ల యాదగిరి, వంగ అర్జున్, చింతా రవి, సుడిగెల హన్మంతులతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed