రాజకీయాల్లో లోకేశ్ బూతుల ట్రెండ్‌ తీసుకొచ్చారు : మంత్రి అవంతి శ్రీనివాస్

by  |
రాజకీయాల్లో లోకేశ్ బూతుల ట్రెండ్‌ తీసుకొచ్చారు :  మంత్రి అవంతి శ్రీనివాస్
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పనిలేని ప్రతిపక్షంగా టీడీపీ ఉందంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు కుమారుడుగా తప్పితే.. ఏ అర్హతా లేని లోకేష్ ఈ మధ్య వెయిట్‌తో పాటు విచక్షణ కూడా కోల్పోయి సీఎంను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రమ్యను కోల్పోయి వారి కుటుంబం బాధలో ఉంటే.. ఓదార్చాల్సిందిపోయి రాజకీయం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళకుండా అడ్డుకోవడం, పోలీసులపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం దురదృష్టకరమన్నారు. సీఎంను వ్యక్తిగతంగా దూషించినంత మాత్రాన జీరోగా ఉన్న లోకేష్ ఎప్పటికీ హీరో కాలేడు అన్నది గుర్తుంచుకోవాలన్నారు.

నాయకుడు అంటే జగన్‌లా ఆదర్శంగా ఉండాలి తప్పితే.. చిల్లర రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు. లోకేశ్‌ గ్రామ స్థాయి నాయకుడి కంటే హీనంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. అమెరికాలో చదివానని చెప్పుకునే లోకేశ్ ఇలాంటి భాషను ప్రయోగించడం ఎంతవరకు సబబో ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రాజకీయాల్లో నారా లోకేశ్ బూతుల ట్రెండ్‌ను కొత్త ట్రెండ్‌గా తెచ్చాడని ధ్వజమెత్తారు. యుద్ధంలో జయించిన హీరో మాదిరిగా నిన్న రమ్య కుటుంబ సభ్యుల పరామర్శకు వెళ్ళిన లోకేశ్‌.. నుదుటున పెద్ద బొట్టుపెట్టుకుని, కారు దగ్గర పిడికిలి బిగించి చూపిస్తూ సంకేతాలు ఇస్తూ, పోలీసులపై దౌర్జన్యం చేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటి…?. పెళ్ళికి, చావుకీ ఒకే మంత్రం అన్నట్టుగా లోకేశ్‌ చేష్టలు ఉన్నాయని మండిపడ్డారు. దళితుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకిగానీ, లోకేశ్‌కు గానీ లేదన్నారు. దళితులు ఈ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్‌కు ఆత్మలాంటి వారన్నారు. ఇకనైనా టీడీపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ను మానుకుంటే మంచిదని మంత్రి అవంతి శ్రీనివాస్ హితవు పలికారు.

రమ్య హత్య దురదృష్టకరం

బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం, వైసీపీ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. హోం మంత్రి సుచరిత సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి వారికి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థినిని ఈ విధంగా హత్య చేయడం చాలా బాధాకరమన్నారు. సోషల్ మీడియా ద్వారాగానీ, ప్రత్యక్షంగా కానీ మహిళలు, యువతులపై ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని లేకపోతే దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే.. ఈ ప్రభుత్వం ఏ కులమైనా, మతమైనా, ఎవర్నీ ఉపేక్షించేది లేదన్నారు. రమ్య హత్య కేసులో.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్టు చేయడం అభినందనీయమన్నారు.


Next Story

Most Viewed