తప్పేంటి..? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన మంత్రి అనిల్

by  |
తప్పేంటి..? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన మంత్రి అనిల్
X

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ రోజు రోజుకు ముదురుతోంది. ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు దారుణమని.. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాదు సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ కెబినెట్‌లో జరిగిన చర్చపై ఏపీ ఇరిగేషన్ వర్గాలు అభ్యంతరం తెలిపాయి. కృష్ణానది నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ అక్రమ ప్రాజెక్టులు కడుతోందన్న తెలంగాణ ఆరోపణలను మంత్రి అనిల్‌కుమార్‌ కొట్టి పారేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ చట్టబద్ధమైనవేనన్న ఆయన తమకు కేటాయించిన నీటికి మించి చుక్క నీరుకూడా అదనంగా తీసుకోవడం లేదని తేల్చి చెప్పారు.

6 టీఎంసీలకు పైగా సామర్థ్యమున్న ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్‌ పెడితే.. తప్పెలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో 881 అడుగుల నీరు చేరితేనే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే అవకాశముంటుందని, 848 అడుగుల నీటిమట్టం ఉంటే చుక్కనీరు కూడా తీసుకోలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని 15 రోజులే తీసుకునే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 6 టీఎంసీపైగా సామర్థ్యం కల్గిన ప్రాజెక్టులను అనుమతులు లేకుండా కడుతోందన్నారు. శ్రీశైలంలో 800 అడగుల లోపు నీరున్నా …నీటిని లిఫ్టే చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోందని వివరించారు. కల్వకుర్తి బీమా నెట్టెంపాడు సామర్థ్యం పెంచారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోనూ లిఫ్టు పెట్టారని.. సుంకేసుల వద్ద తెలంగాణ కడుతోన్న ప్రాజెక్టు సక్రమమైందా అని ప్రశ్నంచారు.

మీరు చేస్తే తప్పులేదు…మేం నిబంధనల ప్రకారం చేస్తే తప్పా అంటూ నిలదీసారు. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ ప్రాజెక్టులు కట్టడం లేదని తేల్చి చెప్పారు. కృష్ణా నది నుంచి సరిపడా నీరు తీసుకునేందుకే పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచుతున్నామన్నారు. అక్రమ ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసామని.. భవిష్యత్తులోనూ తెలంగాణ అక్రమ ప్రాజెక్టు లపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. మంచి తనం బలహీనత కాదని.. రెండు రాష్ట్రాలు బాగుండాలనే సంకల్పంతో జగన్ ముందుకెళ్తున్నారని వివరించారు. ఇద్దరు సీఎంలు అన్నదమ్ములుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఎప్పుడు కఠినంగా ఉండాలో సీఎం జగన్‌కు తెలుసని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పూర్తవటంతో ఏమీ చేయలేకపోయినా..మంచి మనసుతో ప్రారంభోత్సవానికి వెళ్లామని మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు.


Next Story