ఖమ్మంలో టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌..

by  |
ఖమ్మంలో టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌..
X

దిశ‌ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌’ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు తొలిసారిగా ఖమ్మం క‌లెక్టరేట్ ప్రాంతంలో మేయర్ పాపాలాల్‌తో కలిసి షి మొబైల్ బయో-టాయిలెట్స్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) పట్టణాల సాధనలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించిన సంగతి తెలిసిందేని అన్నారు. ప్రస్తుతం సామాజిక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టిసారించామని ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని తెలిపారు. ఇందులో భాగంగా అవసరమైన చోట్ల ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌’ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ఇటీవలే ఆదేశించారని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ‘స్త్రీ టాయిలెట్ల’ను ఆదర్శంగా తీసుకున్నామని సూచించారు. వీటిని తక్కువ వ్యవధిలో పూర్తిచేయడంతో పాటు కావాల్సినచోటికి తరలించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సమీప ఆర్టీసీ డిపోల నుంచి కాలంచెల్లిన బస్సులను తీసుకొని వాటిని ‘స్త్రీ టాయిలెట్లు’గా మార్చాలని ఇప్పటికే సూచించామని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ల కోసం వసతులు కల్పించాలని నిర్ణయించామన్నారు. వీటిని రద్దీ మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు, పార్కులు, ప్రార్థనా మందిరాలు, నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలు, వారాంతపు అంగళ్లు వంటి ప్రాంతాలకు తరలించవచ్చన్నారు. వీటి నిర్వహణను స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్స్‌ (ఎస్‌ఎల్‌ఎఫ్‌) లేదా పట్టణ వికలాంగుల సమితి లేదా మహిళా సంఘాలు లేదా ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story

Most Viewed