అక్కడే.. అందరికీ నాణ్య‌మైన విద్య‌ : మంత్రి

by  |
అక్కడే.. అందరికీ నాణ్య‌మైన విద్య‌ : మంత్రి
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనాతో పాఠశాలల ప్రారంభం ఆలస్యమవుతున్నందున విద్యార్థులకు, పాఠ్య పుస్తకాల పంపిణీ చేపట్టినట్టు చెప్పారు. ఈ పాఠ్యపుస్తకాలను వినియోగించుకుని బాగా చదువుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లాలో ఉన్న పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ మొత్తం కలిపి 1329 పాఠశాలలో చదువుకుంటున్న 1,07,266 మంది విద్యార్థులకు గాను 5.65 లక్షల పుస్తకాలను పంపిణీ చేసినట్టు తెలిపారు. కరోనా మహమ్మారి తగ్గగానే ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించడం, అక్కడ విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. కరోనా మహమ్మారి తగ్గాలని, త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా సహకరించి, నివారణ చర్యలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్ , కలెక్టర్ కర్ణన్, డీఈవో మధన్ మోహన్, కార్పొరేటర్ చావా నారాయణ రావు, ఉపాధ్యాయులు, అధికారులు ఉన్నారు.



Next Story

Most Viewed