కరోనాతో పలు రైళ్లు రద్దు.. గమ్యం చేరేదెట్లా.?

by  |
కరోనాతో పలు రైళ్లు రద్దు.. గమ్యం చేరేదెట్లా.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు కార్మికులు వచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రం కావడంతో ప్రభుత్వం రాత్రి కర్ప్యూ విధించింది. దీంతో ఆందోళనకు గురైన వలస కార్మికులు లాక్‌డౌన్ పడితే ఇబ్బందులు పడతామని ముందస్తుగానే గమ్యస్థానాలను చేరుకునేందుకు భారీగా తరలివెళ్తున్నారు. ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంగణాలు కిక్కిరిపోతున్నాయి. అయితే రైల్వే అధికారులు ప్రయాణికుల రాకపోకలు తగ్గాయని, తక్కువ ఆక్యుపెన్సీ వస్తుందనే సాకుతో రైళ్లు రద్దు చేయడంతో వలస కార్మికులంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎటు వెళ్లాలో తెలియక స్టేషన్ ప్రాంగణంలోనే కూర్చుండిపోయారు.

పలు రైళ్లు రద్దుతో..

తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ‌తో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు 15 రోజులు క్వారంటైన్ అని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికులు తక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారని.. దీంతో అతి తక్కువ ఆక్యుపెన్సీ దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ నెల 7న నిర్ణయం తీసుకున్నారు. పలు ప్రాంతాల మధ్య నడిచే 28 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

అదే విధంగా ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 30 రైళ్లను సైతం రైల్వేశాఖ రద్దు చేసింది. శతాబ్ది, జనశతాబ్ది, దురంతో, రాజధాని రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ముంబై, జల్నా, బీదర్, నాగపూర్, సి షాహుమహరాజ్ టి కొల్లాపూర్, యశ్వంత్‌పూర్- ఔరా, ఔరా- యశ్వంత్‌పూర్ మధ్య రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ విషయం తెలియక వలస కార్మికులు ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిక్కిరిసింది.

చెట్ల కిందే ఆశ్రయం..

గుజరాత్, ఒరిస్సా, మహారాష్ట్ర, బీదర్, ముంబై, ఏపీ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కరోనాతో పనులు తగ్గడం, మరో పక్క రాష్ట్రంలో లాక్‌డౌన్ పెడితే ఇబ్బందులు పడతామనే భయంతో తమ తమ స్వంత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అందరూ టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. అద్దెలకు తీసుకున్న ఇళ్లను ఖాళీ చేసి కుటుంబంతో పాటు లాగేజీ, దుప్పట్లు మోటార్ సైకిళ్లు సైతం తీసుకొని రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అయితే పలు ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులంతా చేసేదేమీ లేక స్టేషన్ ప్రాంగణంలో కొంత మంది సమీపంలోని చెట్లను ఆశ్రయించారు. తినేందుకు ఫుడ్ లేక, గమ్యస్థానానికి ఎలా పోవాలో తెలియక సతమతమవుతున్నారు. వారి బాధలు వర్ణణాతీతం.

Next Story

Most Viewed