లాక్‌డౌన్ భయంతో మళ్లీ సొంతూళ్లకు..

by  |
లాక్‌డౌన్ భయంతో మళ్లీ సొంతూళ్లకు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నగరంలో అయితే రోజు పని దొరుకుతుంది… కుటుంబాన్ని పోషించుకోవచ్చు… పిల్లలను చదివించుకోవచ్చు… నాలుగు రాళ్లు వెనకేసుకొవచ్చు’ అని రాష్ట్రంలోని నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన చాలామంది హైదరాబాద్‌కి వచ్చిన జీవనం కొనసాగిస్తున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. దీంతో వలస వచ్చిన కూలీలంతా లాక్‌డౌన్ విధిస్తారేమోనని భయంతో నగరాన్ని వీడుతున్నారు. గతేడాది పరిస్థితి పునరావృతం అవుతుందోనని ఇంటిబాట పడుతున్నారు. దీంతో బస్టాండులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

గతేడాది కరోనాతో తీవ్ర ఇబ్బంది పడిన వలస కూలీలు వ్యాధి తగ్గుముఖం పట్టడంతో.. ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కోల్‌కత్తా, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గడ్, జార్ఖండ్, రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఔరా, నేపాల్‌తో పాటు తదితర రాష్ట్రాలకు చెందిన వారు నగరానికి వచ్చారు. భవన నిర్మాణ రంగంతో పాటు ఇళ్లల్లో, హోటళ్లు, చిన్న చిన్న కంపెనీలలో రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడం, ఉధృతి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాధి నివారణకు నైట్ కర్ప్యూ విధించింది. దీంతో భయభ్రాంతులకు గురైన వలస కూలీలు గత సంవత్సరం మాదిరిగా లాక్‌డౌన్ వేస్తారేమోనని ముందస్తుగానే భార్య పిల్లలతో కలిసి సొంతూళ్లకు బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీహిల్స్, ఉప్పల్, ఎల్ బీనగర్ బస్ స్టేషన్లు వలస కూలీలతో కిటకిటలాడుతున్నాయి.

లగేజీతో సహా..

ఏడాది కాలంగా కరోనా ప్రజలను వీడటం లేదు. తగ్గుతుందోనని ఆశించి పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చిన కూలీలకు నిరాశే మిగులుతోంది. కరోనా రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం నైట్ కర్ప్యూ విధించింది.. దీంతో వలసకూలీలంతా ఇక నగరానికి వచ్చేది కష్టమేనని… బతికుంటే బల్చాకు తినైనా బతుకుతామని ఇంటి సమాను, డ్రమ్ములు, తదితర లగేజీతో సహా ఇంటికి వెళ్తున్నారు. అంతా ఒకేసారి పయనం కావడం, బస్సుల వేళల్లో మార్పులు చేయడంతో కూలీలకు సరిపడ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Next Story

Most Viewed