రోబోలతో జర్నలిస్టుల రీప్లేస్!

by  |
రోబోలతో జర్నలిస్టుల రీప్లేస్!
X

క‌ృత్రిమ మేధస్సు కారణంగా చాలా రంగాల్లో మానవుల అవసరం లేకుండా పోయి, ఉద్యోగాల కొరత ఏర్పడే ప్రమాదముందన్న విషయం ఎప్పట్నుంచో చర్చనీయాంశంగా ఉంది. అయితే ఏ ఉద్యోగం సంగతెలా ఉన్నా.. సృజనాత్మక రంగంలో రచయిత, జర్నలిస్టు, అనువాదకుడు వంటి ఉద్యోగాలకు ఢోకా లేదనుకున్నారు. అందుకు భిన్నంగా మైక్రోసాఫ్ట్ సంస్థ.. గురువారం 27 మంది జర్నలిస్టులను తొలగించి వారి స్థానాల్లో కృత్రిమ మేధస్సు గల రోబోలను నియమించింది.

మైక్రోసాఫ్ట్ వారి ఎంఎస్ఎన్, ఎడ్జ్ బ్రౌజర్ హోమ్ పేజీల్లో కనిపించే వార్తలను ఎడిట్ చేసి, తప్పులు చూసి, క్యూరేట్ చేసే పనికోసం ప్రెస్ అసోసియేషన్ నుంచి జర్నలిస్టులను నియమించుకుంది. ఇప్పుడు వారు చేస్తున్న పనిని రోబోలు చేయగలుగుతుండటంతో వారిని తీసేసినట్లు తెలుస్తోంది. అయితే సృజనాత్మకతను ఉపయోగించి, ఎడిటింగ్ నియమాలను పాటిస్తూ విచక్షణా జ్ఞానంతో చేయగల తమ ఉద్యోగాన్ని ఇలా రోబోలతో చేయించడం వల్ల మైక్రోసాఫ్ట్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఉద్యోగం కోల్పోయిన ఓ జర్నలిస్టు వాపోయారు.

అంతేకాకుండా తప్పుడు సమాచారం వల్ల దేశాల మధ్య గొడవలు జరుగుతున్న ఇలాంటి సమయాల్లో.. రోబోల మీద ఆధారపడాలనుకోవడం పిచ్చితనమేనని వారు ఎద్దేవా చేస్తున్నారు. అయితే న్యూస్ వెబ్‌సైట్ల నుంచి వస్తున్న ఆర్టికల్స్ అన్నీ కూడా ముందే క్యూరేట్ చేసి వస్తుండటం, పెద్దగా ఎడిటింగ్ అవసరం లేకపోతుండటంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ అంటోంది. అంతకు మించి దీనికి, కొవిడ్ 19 ప్రభావానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. అయితే జర్నలిజం విషయంలో కృత్రిమ మేధస్సు సాయం తీసుకోవాలని గూగుల్, ఫేస్‌బుక్ వంటి కంపెనీలు పెట్టుబడులు కూడా పెడుతున్నాయి. చూడబోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముందు నష్టపోయేది జర్నలిస్టులేమోనని అనిపిస్తోంది!

Next Story

Most Viewed