Microsoft: 2 ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో మైక్రోసాఫ్ట్

by  |
Microsoft: 2 ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో మైక్రోసాఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరో అరుదైన రికార్డును సాధించింది. మార్కెట్ విలువ పరంగా 2 ట్రిలియన్ డాలర్ల రెండో కంపెనీగా నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డును యాపిల్ కంపెనీ మాత్రమే సాధించింది. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్‌లో కంపెనీ అత్యద్భుతమైన వృద్ధి సాధించడం ద్వారానే గణనీయంగా మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ పెరిగింది. మంగళవారం నాటి అమెరికా స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ ధర 1.2 శాతం పెరగడం ద్వారా ఈ మార్కును చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2 ట్రిలియన్ డాలర్లను చేరుకునే కంపెనీల జాబితాలో సౌదీ అరామ్‌కో 1.9 ట్రిలియన్ డాలర్లతో చేరువలో ఉంది. మైక్రోసాఫ్ట్ కంపెనీకి ప్రధానంగా కొవిడ్ మహమ్మారి తర్వాత టెక్ వ్యాపారంలో భారీగా వృద్ధి నమోదవడం కలిసొచ్చింది. లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగుల పనివిధానంలో రిమోట్ వర్క్ పెరగడం ద్వారా కంపెనీ ఆన్‌లైన్ సమావేశం కోసం సాఫ్ట్‌వేర్, నె్‌వర్కింగ్ సాఫ్ట్‌వేర్ డిమాండ్ భారీగా పెరిగింది. దీనికితోడు చాలామంది ఇళ్లకే పరిమితం కావడంతో గేమింగ్ రంగంలోని ఎక్స్‌బాక్స్‌కు డిమాండ్ అధికంగా పుంజుకుంది.

క్రెడిట్ సత్య నాదెళ్లదే..

మైక్రోసాఫ్ట్ సీఈఓగా 2014లో సత్య నాదెళ్ల బాధ్యతలను చేపట్టారు. ఆయన రాకతో మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంపై ఆయన ఎనలేని విశ్వాసం కనబర్చారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్‌వేర్ వినియోగం పెరిగింది. దీంతో మైక్రోసాఫ్ట్ ఇన్‌ఫ్రా, ఆఫీస్ అప్లికేషన్ యూనిట్లను మైక్రోసాఫ్ట్ భారీగానే విస్తరించగలిగింది. సత్య నాదెళ్ల సారథ్యంలోనో క్లౌడ్ డివిజన్, విండ్ డివిజన్‌లను వేరు వేరు చేశారు. అమ్మకాల్లోనూ మార్పులు తీసుకొచ్చారు. దీంతో అమెజాన్ క్లౌడ్ వ్యాపారానికి సరైన పోటీని మైక్రోసాఫ్ట్ ఇవ్వగలిగింది. ఈ నేపథ్యంలో మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారంలో మైక్రోసాఫ్ట్ 20 శాతం వాటాను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ మొత్తం ఆదాయంలో క్లౌడ్ విభాగం వాటా 24 శాతం నుంచి 33.8 శాతానికి పెరిగిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. సత్య నాదెళ్ల సీఈఓగా రావడానికి ముందు కంపెనీ విలువ 310 బిలియన్ డాలర్లుగా ఉండేది. అనంతరం ఆయన వ్యాపార వ్యూహాలతో, మెరుగైన నిర్ణయాలతో 2019 సమయానికి 1 ట్రిలియన్ డాలర్ల మార్కును కంపెనీ సాధించింది. తర్వాత రెండేళ్లలోనే 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గడిచిన ఏడాది కాలంలో మైక్రోసాఫ్ట్ షేర్ 19 శాతం పెరగడం గమనార్హం.


Next Story