ఆ పరిష్కారాల కోసం జియోతో జతకట్టిన ఎంజీ మోటార్స్

by  |
ఆ పరిష్కారాల కోసం జియోతో జతకట్టిన ఎంజీ మోటార్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా తన రాబోయే మిడ్-సైజ్ ఎస్‌యూవీ మోడల్‌లో సరికొత్త ఫీచర్లను అందించేందుకు జియోతో జతకడుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. రాబోయే తన ఎస్‌యూవీ కారులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) పరిష్కారాలను అందించేందుకు జియో భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది. జియో సంస్థకున్న విస్తృతమైన నెట్‌వర్క్ ద్వారా రానున్న ఎంజీ మిడ్-సైజ్ ఎస్‌యూవీ వినియోగదారులు మెట్రోలతో పాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ కూడా కనెక్టివిటీ ప్రయోజనాలను పొందుతారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

“ఆటోమొబైల్ పరిశ్రమలో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగింది. సాఫ్ట్‌వేర్ ఆధారిత పరికరాలను కార్లలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఐఓటీ స్పేస్‌లో జియో లాంటి టెక్ ఆవిష్కరణల భాగస్వామ్యంతో పరిశ్రమలో మరిన్ని కొత్త ఫీచర్లను అందించేందుకు వీలవుతుందని” ఎంజీ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా అన్నారు. ఎంజీ కొత్త ఎస్‌యూవీలో జియో టెక్నాలజీ వినియోగం ద్వారా డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తూనే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కువ భద్రతను అందిస్తుంది.

ఎంజీ మోటార్స్‌తో భాగస్వామ్యం ద్వారా జియో ఈ-సిమ్, స్ట్రీమింగ్ పరిష్కారాలతో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ ఇంకా ఇతర కనెక్టివిటీ ప్రయోజనాలను అందించనున్నట్టు జియో డైరెక్టర్ కిరణ్ థామస్ చెప్పారు. కాగా, ఎంజీ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి త్రైమాసికంలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.


Next Story

Most Viewed