20 నిమిషాల్లోనే భారీగా అమ్ముడుపోయిన కార్లు

by  |
Car14s2
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తన ఎస్‌యూవీ ఆస్టర్ మోడల్ కోసం గురువారం బుకింగ్స్ ప్రారంభించింది. ఇది మొదలైన 20 నిమిషాల్లోనే మొత్తం 5,000 యూనిట్లు అమ్ముడయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ వాహనాలను నవంబర్ 1 నుంచి డెలివరీలు అందిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్‌ను బుకింగ్ చేసుకునేందుకు కంపెనీ రూ. 25,000గా నిర్ణయించింది. ‘వినియోగదారుల నుంచి ఈ స్థాయిలో స్పందన వస్తుందని తాము ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. అయితే, ప్రస్తుత దేశీయ ఆటో పరిశ్రమలో సెమీ కండక్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో పరిమితంగానే కార్ల సరఫరా చేపట్టాలని నిర్ణయించాం. 2022 మొదటి త్రైమాసికం నాటికి సరఫరా మెరుగుపడుతుందని ఆశిస్తున్నామని’ ఎంజీ మోటార్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చామా అన్నారు. కాగా, ఎంజీ మోటార్ ఇండియా దేశీయ ఎస్‌యూవీ మార్కెట్లో ఆదరణ కలిగిన హ్యూండాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మోడళ్లకు పోటీగా ఆస్టర్‌ను రూ. 9.78 లక్షల నుంచి రూ. 16.78 లక్షల(ఎక్స్‌షోరూమ్) మధ్య విడుదల చేసింది. వచ్చే కేలండర్ ఏడాది నాటికి సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడిన తర్వాత వాహనాల డెలివరీలు ఊపందుకుంటాయని కంపెనీ భావిస్తోంది. దీని ద్వారా వచ్చే ఏడాదిలో నెలకు 7-8 వేల వాహనాలతో రెట్టింపు అమ్మకాలు సాధించాలని లక్ష్యంగా ఉంది.

Next Story

Most Viewed