రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు వర్షాలు

by  |
రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు వర్షాలు
X

దిశ,న్యూస్​బ్యూరో: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్​ వాతావరణ శాఖ గురువారం తెలిపింది. సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం ఛత్తీస్‌ఘడ్​ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కొనసాగుతున్నట్టు శాఖ వివరించింది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల మీద ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో రెండు, మూడు జిల్లాల్లో భారీ, అతి భారీవర్షాలు కురవనున్నాయి.

గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాలలో అత్యధికంగా 9.4సెంమీ వర్షం కురవగా.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 8.9సెం.మీ, కోరుట్లలో 7.3సెం.మీ వర్షపాతం నమోదయింది. యాదాద్రిలో 4.7సెం.మీ, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 4.5సెం.మీ, సూర్యాపేట, వైరాలో 4.4సెం.మీ, నిజామాబాద్​, సంగారెడ్డి జిల్లాల్లో 3.8 సెం.మీ, వరంగల్​లో 2 సెం.మీ, అదిలాబాద్​, భద్రాచలం, మెదక్​ ఒక సెం.మీ వర్షపాతం నమోదయింది.

గ్రేటర్​లో సాధారణ వర్షపాతం నమోదు

హైదరాబాద్​ నగర వ్యాప్తంగా పలుచోట్ల సాధారణ వర్షపాతం నమోదయింది. జీహెచ్​ఎంసీ పరిధిలో గురువారం 6.9 మిమీ సగటు వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆసిఫ్​ నగర్​లో అత్యధికంగా 19.5మిమీ, పటాన్​చెరులో 17.5మిమీ, శేరిలింగంపల్లిలో 16.3మిమీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్​లో 13.8 మిమీ, సరూర్​ నగర్​, హిమాయత్​ నగర్​, ఖైరతాబాద్​, శ్రీనగర్​ కాలనీలో 13.3మిమీ, బాలానగర్​, నాంపల్లి, సికింద్రాబాద్​, రాజేంద్రనగర్​లో 12.5మిమీ వర్షపాతం నమోదయింది. మీర్​పేట, ముషీరాబాద్​, కూకట్​ పల్లి ప్రాంతాల్లో 11మిమీ, ఉప్పల్​, రాంచంద్రాపూర్​, ఉప్పల్​, మల్కాజిగిరి ప్రాంతాల్లో 10.5 మిమీ వర్షపాతం కురిసింది.

Next Story

Most Viewed