భారత్ లో డైరెక్ట్-టూ-కస్టమర్ మోడల్ తీసుకురానున్న మెర్సిడెస్ బెంజ్

by  |
భారత్ లో డైరెక్ట్-టూ-కస్టమర్ మోడల్ తీసుకురానున్న మెర్సిడెస్ బెంజ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ వినియోగదారులకు వాహనాల ధరల విషయంలో స్పష్టత కోసం ప్రత్యేకంగా డైరెక్ట్-టూ-కస్టమర్ అనే మోడల్‌ను బుధవారం ప్రకటించింది. దీని ద్వారా కంపెనీ డీలర్ల నుంచే కాకుండా ఆన్‌లైన్ ద్వారా నేరుగా కస్టమర్లకు కార్లను విక్రయించనుంది. దేశవ్యాప్తంగా ప్రతి కారుకు ఒకటే నిర్దిష్టమైన ధరను అందించనున్నట్టు తెలిపింది. ఈ మోడల్‌ను ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి ప్రారంభిస్తామని, దీనివల్ల కార్ల విక్రయాలు సులభతరం అవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో కంపెనీ డీలర్లకు సైతం లాభదాయకత ఉంటుందని తెలిపింది.

భారత మార్కెట్లో రిటైల్ వ్యాపారంలో వినియోగదారుల సెంటిమెంట్‌ను పటిష్టం చేసేందుకు కంపెనీ దీర్ఘకాలిక చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరించింది. ఈ మోడల్‌లో కార్ల కొనుగోలుకు సంబంధించి ఇన్‌వాయిస్ నేరుగా వినియోగదారులకు అందజేయడం జరుగుతుందని, డీలర్లతో చర్చించే పనుండదని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో కస్టమర్లకు ఈ విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నట్టు కంపెనీ ఎండీ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. అయితే, ఈ కొత్త మోడల్ విషయంలో భారతీయ కస్టమర్లు ఎలా స్పందిస్తారనే అంశంపై స్పష్టత లేదని, ఆఫర్ల ఎలా ఉండనున్నాయనే సందేహం ఉంటుందని కంపెనీ అభిప్రాయపడింది.

కాగా, ప్రస్తుత ఏడాదిలో కంపెనీ మొత్తం 15 మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్టు ఇదివరకు ప్రకటించింది. ఇందులో భాగంగా త్వరలో మరో కొత్త లగ్జరీ కార్ మోడల్‌ను తీసుకురానున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఈ నెలలోనే జీఎల్ ఎస్ 600 అల్ట్రా లగ్జరీ ఎస్ మూవీని తీసుకురానున్నట్టు పేర్కొంది. గత నెలలో కంపెనీ నుంచి జీఎల్‌సీ మోడళ్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed