61 శాతం భారతీయుల్లో మానసిక సమస్యలు..

by  |
61 శాతం భారతీయుల్లో మానసిక సమస్యలు..
X

– లాక్‌డౌన్ ఎఫెక్ట్‌గా వెల్లడించిన సర్వే

లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైనందున.. జనాల్లో మానసిక సంఘర్షణలు పెరిగి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒక సర్వేలో కరోనా లాక్‌డౌన్ కారణంగా 61 శాతం మంది భారతీయులు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది.

రీబూటింగ్ 2020 : ‘ఏ స్టోరీ ఆఫ్ కొవిడ్ 19’ పేరుతో మావెరిక్ ఇండియా అనే సంస్థ సర్వే నిర్వహించింది. తమ మానసిక ఆరోగ్యం మీద కొవిడ్ సంక్షోభం తీవ్ర ప్రభావాన్ని చూపించినట్లు తమకు స్పష్టంగా తెలుస్తోందని 27 శాతం మంది జనరేషన్ జీ, 19 శాతం మంది మిలెన్నియల్స్ తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా ఎక్కువ ప్రభావితమైన వారిలో గృహిణులు మొదటిస్థానంలో ఉన్నారు. ఇంట్లో పనివాళ్లు రాకపోవడం, ఎవరూ సాయం చేయకపోవడం, అలాగే అందరూ ఇంట్లోనే ఉండటంతో కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాల్సి రావడంతో వారికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏప్రిల్-మే నెలల్లో దాదాపు 600 మందిని ఆన్‌లైన్‌లో ప్రశ్నించి ఈ సర్వేను నిర్వహించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా తమకు ఇంటి నుంచి పనిచేయడం చాలా ఇబ్బందిగా ఉందని 75 శాతం మంది వెల్లడించారు. ఇందుకు వారు చెప్తున్న ఒకే ఒక కారణం వృత్తిగత, వ్యక్తిగత జీవితాలను సమన్వయం చేసుకోలేకపోవడం. అలాగే ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఈ సర్వేలో కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భారత ఆర్థిక వ్యవస్థ పూర్వవైభవాన్ని తెచ్చుకోవడానికి ఎంతకాలం పడుతుండొచ్చు అనే ప్రశ్నకు 90 శాతం మంది సంవత్సరంలోగా అని సమాధానమిచ్చారు. ఇక మిగతా 10 శాతం మంది మాత్రం కనీసం ఒకటి లేదా రెండు సంవత్సరాలు పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక మీడియా ఛానళ్ల కంటే ఆన్‌లైన్ సమాచారం ఉత్తమమని.. ఇక నుంచి ఆరోగ్యం, కుటుంబం మినహా డబ్బు, ఆస్తి వంటి వాటికి తక్కువ ప్రాధాన్యాతనిస్తామని దాదాపు 90 శాతం మంది వెల్లడించడం వారి మానసిక ఆలోచనలపై కొవిడ్ ప్రభావం భారీగానే ఉందని తెలియజేస్తోంది.


Next Story

Most Viewed