ఈ నెల‌ 13 నుంచి సింగ‌రేణిలో మెగా వ్యాక్సినేష‌న్‌..

by  |
Mega vaccination Starts in Singareni
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఉద్యోగుల‌కు ర‌క్షణ క‌ల్పించే దిశ‌గా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ మ‌రో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. సంస్థలో ప‌నిచేస్తున్న ఉద్యోగులంద‌రికీ రెండువారాల్లోగా వ్యాక్సినేష‌న్ పూర్తి చేయ‌డం కోసం సింగ‌రేణి వ్యాప్తంగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను చేప‌ట్టాల‌ని డైరెక్టర్లు, జీఎంల‌కు ఆదేశాలు జారీ చేశారు. సింగ‌రేణిలో క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై శ‌నివారం డైరెక్టర్లు, ఏరియా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయ‌న‌ స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా వ‌య‌సుతో సంబంధం లేకుండా సంస్థలో ప‌నిచేస్తున్న ఉద్యోగులంద‌రికీ వ్యాక్సిన్ ఇప్పించ‌డం ద్వారా క‌రోనా నుంచి ర‌క్షణ క‌ల్పించ‌వ‌చ్చన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం త‌లెత్తకుండా నిరంత‌రాయంగా బొగ్గును వెలికితీస్తున్న సింగ‌రేణి ఉద్యోగుల‌ను ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌గా గుర్తించి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖ‌ర‌రావు ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చార‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం స‌హ‌కారం నేప‌థ్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి సింగ‌రేణి వ్యాప్తంగా మెగా వ్యాక్సినేష‌న్‌కు అన్ని ఏర్పాట్లు చేయాల‌ని సీఎండీ శ్రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ స్పష్టం చేశారు.

సింగ‌రేణిలో ఇప్పటికే 45 ఏళ్ల వ‌య‌సు పైబ‌డిన 16 వేల మంది ఉద్యోగుల‌కు, 14 వేల మంది ఉద్యోగుల కుటుంబీకుల‌కు, 6 వేల మంది విశ్రాంత ఉద్యోగుల‌కు వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌న్నారు. మిగిలిన 29 వేల మంది ఉద్యోగుల‌కు 10 రోజుల్లో వ్యాక్సిన్ తొలి డోసు అందించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని స్పష్టం చేశారు. భౌతిక దూరాన్ని, కరోనా నిబంధ‌న‌లు పాటిస్తూ అంద‌రికీ వ్యాక్సిన్ ఇప్పించేందుకు వీలుగా ఏరియాల్లో క‌మ్యూనిటీ కేంద్రాలు, డిస్పెన్సరీలు, ఆసుప‌త్రుల‌లో అన్ని ఏర్పాట్లు చేయాల‌ని ఏరియా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్లకు స్పష్టమైన ఆదేశాల జారీ చేశారు. రానున్న 10 రోజుల్లో సింగ‌రేణి వ్యాప్తంగా ఉద్యోగులంద‌రికీ వ్యాక్సినేష‌న్ పూర్తవుతుంద‌ని వివ‌రించారు.

మెగా వ్యాక్సినేష‌న్‌లో ప్రతి ఒక్క సింగ‌రేణి ఉద్యోగి టీకా తీసుకునేలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. వ్యాక్సినేష‌న్‌కు వ‌చ్చే ఉద్యోగి విధిగా ఆధార్ జిరాక్స్ కాపీ, కంపెనీ గుర్తింపు కార్డును తీసుకుని రావాల్సిందిగా చూడాల‌న్నారు. సింగ‌రేణి వ్యాప్తంగా మెగా వ్యాక్సినేష‌న్ కు స‌హ‌క‌రిస్తున్న కేసీఆర్‌కు ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. స‌మీక్షా స‌మావేశంలో డైరెక్టర్లు (ఆప‌రేష‌న్స్‌) ఎస్‌.చంద్‌ శేఖ‌ర్‌, (పా, ఫైనాన్స్‌, పి అండ్ పి) ఎన్‌.బ‌ల‌రాం, (ఈ అండ్ ఎం) డి.స‌త్యనారాయ‌ణరావు, జీఎం(కో ఆర్డినేష‌న్) కె.సూర్యనారాయ‌ణ‌, చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ మంథా శ్రీ‌నివాస్‌, వైద్యులు బాల‌కోట‌య్య, పూర్ణచంద‌ర్‌రావు, ఏరియా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed