వాకింగ్ లైబ్రేరియన్.. వయనాడ్ మహిళ!

by  |
వాకింగ్ లైబ్రేరియన్.. వయనాడ్ మహిళ!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. అందుకు ప్రభుత్వమే కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అన్న మాటలు ప్రతీ మహిళా దినోత్సవం రోజున వినబడేవే. కానీ, ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ గురించి పట్టించుకునేవారు అరుదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో రాధామణి ఒకరు. మహిళా సాధికారిత కోసం తన వంతు కృషి చేస్తూ.. పిల్లలు మాత్రమే కాకుండా గృహిణులు, వృద్ధులు సైతం చదువుల తల్లి సరస్వతి బాటలో నడవాలనే ఆశయంతో.. ఆమె ప్రతిరోజూ కిలోమీటర్ల దూరం నడుస్తూ ఇంటింటికీ పుస్తకాలు పంపిణీ చేస్తోంది. ‘వాకింగ్ లైబ్రేరియన్’గా పేరు తెచ్చుకున్న తను.. బుక్స్ పంపిణీ చేయడం వెనకనున్న లక్ష్యం ఏంటో? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కేరళలోని కొట్టాయం, వజూర్ టౌన్‌కు చెందిన రాధామణి.. టీచర్. రాజీవ్ గాంధీ జాతీయ పథకంలో భాగంగా గిరిజన తెగలకు చెందిన పిల్లలకు పాఠాలు చెప్పేది. పేదరిక నిర్మూలన, మహిళా సాధికారిత కోసం కేరళ ప్రభుత్వం ప్రారంభించిన ‘కుటుంబ శ్రీ’ పథకంలోనూ ఆమె సభ్యురాలు. టీచర్‌గా ఉంటూనే ఖాళీ సమయాల్లో లైబ్రరీకెళ్లి పుస్తకాలు చదువుతూ.. వయనాడ్‌లోని ‘ప్రతిభ పబ్లిక్ లైబ్రరీ’లో సభ్యురాలిగా మారింది. ఈ క్రమంలోనే టీచర్‌గా జాబ్ మానేసి, అక్కడే లైబ్రేరియన్‌గా చేరింది. అప్పుడే వయనాడ్‌లోని అన్ని ప్రాంతాల మహిళలకు పుస్తక పఠనం తప్పనిసరి చేయాలని నిర్ణయించుకుంది. మహిళలను వంటింటికే పరిమితం చేయొద్దని, విద్యావంతులుగా మార్చేందుకు తన వంతు తోడ్పాటు, సహకారం అందించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే కేరళ రాష్ట్ర లైబ్రరీ కౌన్సిల్.. లైబ్రేరియన్‌లు ఇంటింటికీ వెళ్లి పుస్తకాలను చేరవేయాలని, తద్వారా వనితలకు చదువు నేర్పించాలని తీర్మానించింది. అందుకు ‘వనిత వయన పద్ధతి(ఉమెన్ రీడింగ్ ప్రాజెక్ట్)’ను ప్రారంభించింది. ప్రస్తుతం దీన్ని ‘వనిత వయోజక పుస్తక వితరణ పద్ధతి(బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ ఫర్ ఉమన్ అండ్ ఎల్డర్లీ)’గా మార్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాధామణి ఇంటింటికీ వెళ్లి పుస్తకాలను అందిస్తోంది.

మహిళలు మొదట ఆమె అందించే భిన్న రకాల లైబ్రరీ పుస్తకాలను తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. ‘మనోరమ, మంగళం’ వంటి మేగజైన్స్ మాత్రమే తీసుకొనేవారు. అయితే ఆమె వారికి మెల్లగా నవలలు, ట్రావెలింగ్‌కు సంబంధించిన పుస్తకాలు అందించి.. ఇవి ఒకసారి చదవండంటూ ప్రోత్సహించింది. అలా వారు క్రమంగా నవలలపై ఆసక్తిని పెంచుకునేలా చేసి, పుస్తక పఠనం వైపు నడిపించింది. ప్రతిరోజూ బ్యాగ్‌లో బుక్స్‌తో ‌‌కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తున్న రాధామణి.. మహిళలకు పుస్తకాలు అందిస్తూ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తోంది.

మహిళలు చదువుకుంటే, ఇంటిల్లిపాదికి చదువు నేర్పుతారని చెబుతున్న రాధామణి.. సెలవు రోజుల్లోనూ ఇంటింటికీ తిరుగుతూ బుక్స్ అందిస్తోంది. ఎందుకంటే.. ఆ రోజుల్లో అయితేనే వృద్ధులు, గృహిణులు ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటారని చెబుతోంది. మొదట్లో తన బ్యాగులో 50 పుస్తకాల వరకు మోసుకెళ్లే దాన్నని, కానీ వయసు మీదపడటంతో ప్రస్తుతం 25 బుక్స్ మాత్రమే తీసుకెళ్తున్నానని 64 ఏళ్ల రాధామణి వివరిస్తోంది. ప్రతి ఇల్లాలు విద్యావంతురాలు కావాలనేది తన లక్ష్యమని, అందుకు తన వంతు కృషి చేస్తానని చెప్తోంది.



Next Story

Most Viewed