మందుల విక్రయాల్లో ఇష్టారాజ్యం..!

by  |
మందుల విక్రయాల్లో ఇష్టారాజ్యం..!
X

దిశ ప్రతినిధి ఆదిలాబాద్/ఆసిఫాబాద్ : మెడికల్‌ దుకాణాలపై ఔషధ నియంత్రణ విభాగం అధికారుల నిఘా పూర్తిగా కొరవడింది. నిరక్షరాన్యులు అధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో దుకాణా యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే వారే లేరని ఆరోపణలునాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా శాంపిల్స్‌ మందులను అంటగడుతూ యథేచ్ఛగా దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

నిబంధనలు పట్టవు..!

మెడికల్ షాపు నిర్వాహకులు నిబంధనలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మెడికల్​షాపుల ద్వారా వినియోగదారులకు ఫార్మసిస్టు ద్వారానే మందులను విక్రయించాలి. షాపులో పరిశుభ్రత పాటించాలని, గ్లాసుతో కూడిన ర్యాకులో మందులు ఉంచాలని, ఫ్రిజ్ తో పాటు, రిజిస్టర్, బిల్ బుక్, కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పడు తీసేయాల్సి ఉంటుంది. అలాగే శాంపిల్స్‌ మందులను విక్రయించొద్దు. ఈ నిబంధనల్లో ఏ ఒక్క దానిని కూడా మెడికల్ షాపుల యజమానులు పాటించిన దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి.

యథేచ్ఛగా శాంపిల్ ​మందుల విక్రయం

జిల్లాలో కొందరు మెడికల్‌ నిర్వాహకులు నిబంధన లకు విరుద్ధంగా శాంపిల్‌ మందులను అమ్ముతున్నట్లు తెలుస్తోంది. నిరక్షరాస్యుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. శాంపిల్​ మందులు అమ్మితే కేసులు పెట్టాలన్నా నిబంధనలు ఉన్నాయి. మెడికల్ షాపుల్లో అడ్డగోలు దోపిడీ జరుగుతున్నా సంబంధిత అదికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన, తిర్యాని, కాగజ్​నగర్, కెరమెరి, వాంకిడి మండలాల్లోని పలు మెడికల్ షాపుల ఈ తరహా దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలున్నాయి.

మెడికల్ షాపుల్లో డీ ఫార్మసీ, బీ ఫార్మసీ చేసిన వారు మందులను విక్రయించాలి. కానీ, ఇందుకు విరుద్దంగా షాపులు నిర్వహణ కొనసాగుతుంది. ఫార్మసిస్టుల సర్టిఫికెట్లను అద్దెకు తీసుకొని పదో తరగతి, ఇంటర్ పాస్, ఫెయిల్ అయిన వ్యక్తులచే ప్రజారోగ్య మందులను విక్రయిస్తుండడం గమనార్హం. మందులను విక్రేయించేవారికి సరైన అవగాహన లేకపోవడంతో మందులు వికటించి, ప్రమాదాల భారిన పడిన సందర్భాలు అనేకం ఉన్నాయని, అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలు పాటించని మెడికల్ షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story