ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బంది దారుణం.. గర్భిణిని ‘మనుషులా, పశువులా’ అంటూ?

by  |
Medical staff, Baby died
X

దిశ, కామారెడ్డి: ‘‘జిల్లాకో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తాం.. కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందేలా వసతులు కల్పిస్తాం’’ అని ప్రభుత్వం ఢంకా బజాయించి చెప్తోంది. కార్పోరేట్ సేవలు దేవుడెరుగు.. ఉన్న సేవలు సక్రమంగా చేయలేని పరిస్థితి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొంది. ‘ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కటే ఉందా.. ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి కదా.. అక్కడికి వెళ్ళండి. ఇప్పుడిక్కడ వైద్యులు లేరు. చెప్తే వినపడ్త లేదా.. మనుషులా పశువులా మీరు.. వెళ్లిపోండి ఇక్కడి నుంచి’ ఈ మాటలు ఎవరో అన్నవి కాదు. సాక్షాత్తు జిల్లా ఆస్పత్రి సిబ్బంది గర్భిణీ కుటుంబ సభ్యుల పట్ల మాట్లాడిన తీరు ఇది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏ విధమైన సేవలు అందుతున్నాయో చెప్పడానికి చక్కని ఉదాహరణ ఇది. కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఆదివారం జరిగిన ఘటన ఇది.

రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన సామగంజి సౌందర్య ప్రవీణ్‌లకు మొదటిగా కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సౌందర్య గర్భిణీ కావడంతో రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ఓ వైపు గర్భిణీ నొప్పులతో బాధ పడుతుంటే మరోవైపు కరోనా పరీక్ష చేయించారా.. చేయించినట్టుగా కనపడటం లేదు అంటూ ఆస్పత్రి సిబ్బంది కాలయాపన చేశారు. కడుపులో బిడ్డ కదలికలు కనిపించడం లేదంటూ స్కానింగ్ చేసుకుని రావాలని పంపించారు. స్కానింగ్ చేసుకుని వచ్చాక ఓ మాత్ర ఇచ్చి సరిపెట్టారు. ఇప్పుడు డాక్టర్ లేరు. రేపు ఉదయం వస్తారన్న కబురు చల్లగా చెప్పారు. అయినా డాక్టర్‌కు ఫోన్ చేసి ఎమర్జెన్సీ అని చెప్పి రమ్మనండి అని కుటుంబ సభ్యులు బతిమిలాడారు. అయినా, సిబ్బంది వినిపించుకోలేదు. ‘‘చెప్పేది మీకు కాదా.. మనుషులా మీరు పశువులా.. ప్రభుత్వ ఆసుపత్రి తప్ప ఇంకా ఏవి లేవా.. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళండి’’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. లేదా ఉదయం డాక్టర్ వచ్చే వరకు ఆగండి అని చెప్పారు.

దాంతో చేసేదేమిలేక ఉదయం వరకూ వేచి చూశారు. తీరా సోమవారం ఉదయం వచ్చిన డాక్టర్ గర్బిణీని పరీక్షించి, కడుపులో బిడ్డ కదలిక కనిపించలేదు. దీంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయగా కడుపులోనే ఉమ్మనీరు మింగి చనిపోయింది. దాంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. రాత్రే ఆపరేషన్ చేసి ఉంటే మాకు మహాలక్ష్మి పుట్టి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరితో ఇలాగే చేస్తారా.. మీరు డ్యూటీ చేయడానికి ఉన్నారా టైం పాస్ చేయడానికి ఉన్నారా.. ఇలా ఎంతమందిని చంపుతారు’’ అంటూ బంధువులు వ్యక్తం చేశారు. విషయం తెలిసిన పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సముదాయించారు.

సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : శ్రీనివాస్, పిల్లల వైద్య నిపుణుడు

సింగరాయిపల్లి గ్రామానికి చెందిన సౌందర్య అనే గర్భిణీ ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది సరైన రీతిలో స్పందించలేదని మా దృష్టికీ వచ్చింది. రాత్రే ఆపరేషన్ చేసి ఉంటే పాప బతికేదేమో. దీనిపై పూర్తి విచారణ జరిపిస్తాం. సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటాం. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ ఎవరున్నారో తెలుసుకుని విచారణ చేస్తాం.



Next Story