నగరాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయ్

by  |
నగరాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: “ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ పాకిన కరోనా ప్రస్తుతం పెద్ద నరగాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ నగరంలోనూ కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో మరణాలు రేటు తక్కువగా ఉంది. మరోవైపు వైరస్ నుంచి కోలుకుంటున్నవారి రేటు ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని వైద్య నిపుణులు రాష్ట్ర మంత్రివర్గానికి వివరించారు. ప్రజలు పెద్దగా ఆందోళన పడాల్సిన పని లేదని ప్రజలకు మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కరోనాకు సంబంధించి పలు అంశాలపై నిర్ణయం జరిగింది.

ఎన్ని కరోనా కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని ప్రజలకు మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ఎన్ని డబ్బులు ఖర్చయినా ప్రభుత్వం వెనకాడేది లేదని స్పష్టంచేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి, పాజిటివ్ వచ్చినవారికి అందుతున్న చికిత్స, ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టం చేయడం తదితర అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని, దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులను మంత్రివర్గ సమావేశానికి ఆహ్వానించి చర్చించినట్లు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న కరోనా వైరస్ తాజా పరిస్థితిపై వివరాలు అందించారని తెలిపింది.

కరోనా చికిత్స కోసం వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్, లోమాలిక్యులర్ వెయిట్ హెపారిన్, డెక్సామిథసోన్ ఇంజెక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పిపిఇ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్లను ఇవ్వాలని, ఇందుకోసం 10లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించే అధికారం కలెక్టర్లకు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 10వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది.

కొవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వంద కోట్ల రూపాయలకు అదనంగా మరో వంద కోట్లను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెలవారీగా ఖచ్చితంగా విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున అవసరమైన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ప్రతీరోజు 40వేల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

మంత్రివర్గం నిర్ణయంలో భాగంగా వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాల్లోని అవసరాలను తెలుసుకుని తదనుగుణమైన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది.


Next Story

Most Viewed