వైద్య శాఖలో కలవరం.. వారి అధ్యయనంలో తేలిందే ఇదే!

by  |
covid Patients
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైరస్ వ్యాప్తి నివారణకు నైట్ కర్ఫ్యూ లాంటి ఎన్ని చర్యలు తీసుకున్నా కేసులు పెరగడం వైద్యారోగ్య శాఖను కలవరపెడుతోంది. సెకండ్ వేవ్ తీవ్రతను, దేశవ్యాప్తంగా ఉధృతమవుతున్న పరిస్థితులను అధ్యయనం చేసిన ఆ శాఖ అధికారులు మే నెల మూడవ వారంలో ’పీక్’ స్టేజీకి చేరుకుంటుందని, అప్పటిదాకా నియంత్రించడం కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు నమోదవుతున్న కేసులు, ఆస్పత్రులకు క్యూ కడుతున్న పేషెంట్లకు వైద్య చికిత్స అందడమే గగనంగా భావిస్తోంది. పేషెంట్ల అవసరాలకు తగినంత ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడం పెను సవాలుగా మారింది. మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం పెరిగినందున రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఆ మేరకు సమకూర్చుకోలేకపోతున్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బెడ్‌లన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. వైద్య సిబ్బంది వత్తిడితో పనిచేస్తున్నారు. ఇక ప్రతీరోజు పాజిటివ్ బారిన పడుతున్న పేషెంట్లు అడ్మిషన్ కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య ఆందోళనకరంగా ఉందని, చాలా పరిమిత వనరులతో వారికి ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి రావడం దినదిన గండంగా ఉందన్నారు. ఆస్పత్రుల్లో బెడ్‌ల మొదలు ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమిడెసివిర్ వరకు అన్నింటికీ కొరత ఏర్పడిందని, చివరకు డాక్టర్లు, నర్సులు కూడా తగినంత సంఖ్యలో లేకపోవడంతో పరిమిత వనరులతోనే వైద్య సేవలు అందించాల్సి వస్తోందని వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులే ఇంతటి దయనీయంగా ఉంటే రానున్న నాలుగు వారాల్లో పెరిగే కేసులు, ఆ తర్వాత ఆస్పత్రుల్లో చేరే పేషెంట్లకు సేవలు అందించడం కష్టమేననే ఆందోళనను వ్యక్తం చేశాయి.

’గాంధీ’లో బెడ్‌లు, వెంటిలేటర్లు ఫుల్

కరోనా కోసం ప్రత్యేకంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో ఐసీయు, ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్‌లన్నీ నిండిపోయాయని, కొత్తగా వచ్చే పేషెంట్లకు ఖాళీ లేదని ఆ వర్గాలు గుర్తుచేశాయి. వెయ్యి మంది ఐసీయూ వార్డుల్లో, 670 మంది పేషెంట్లు వెంటిలేటర్ మీద ఉన్నారని, రోజూ వందల సంఖ్యలో కొత్త పేషెంట్లు అడ్మిషన్ కోసం వస్తున్నారని, వారిని చేర్చుకోవడం సాధ్యమే కావడంలేదని ఆసుపత్రి వర్గాలు వ్యాఖ్యానించాయి. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లను నిత్యం గమనించాల్సి ఉంటుందని, దానికి తగిన సంఖ్యలో అనెస్థీషియా స్పెషలిస్టులు, సీనియర్ నర్సులు లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. దీన్ని గమనంలోకి తీసుకున్న ప్రజారోగ్య శాఖ వివిధ జిల్లాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఉన్న పాతిక మంది అనెస్థీషియా నిపుణులను, పల్మనాలజిస్టులను, జనరల్ ఫిజిషియన్‌లను గాంధీ ఆస్పత్రికి డిప్యూటేషన్ మీద పంపించింది.

గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రి పరిస్థితి కూడా ఇదే తీరులో ఉంది. మొత్తం ఎనిమిది అంతస్తుల్లోని వార్డుల్లో పేషెంట్లు నిండిపోయారు. ఖాళీ బెడ్‌లు దొరకడంలేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసీయూ వార్డుల్లో ఉన్న పేషెంట్ల ఆరోగ్యం విషమిస్తుండడంతో చివరి గంటల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని, ఆ కారణంగా పేషెంట్లు చనిపోతున్నారని రెండు ఆస్పత్రుల డాక్టర్లు వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రానున్న నాలుగు వారాలు ఇలాంటి పరిమితుల మధ్య పేషెంట్లు వైద్య చికిత్స అందించడం వారిని ఆందోలనకు గురిచేస్తోంది.


Next Story

Most Viewed