బల్దియాలో ‘‘ఎంబీ’’ల గల్లంతు…

by  |
బల్దియాలో ‘‘ఎంబీ’’ల గల్లంతు…
X

కరీంనగర్ బల్దియాలో ఏకంగా మెజెర్‌మెంట్స్ బుక్స్ గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. నిర్మాణాల్లో అత్యంత కీలకమైన మెజెర్‌మెంట్స్ బుక్స్ (ఎంబీ)లే గల్లంతు కావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 18 వరకు ఎంబీలు మాయం అయినా పట్టించుకునే వారు లేకుండా పోయారు. వాస్తవంగా ఎంబీలు సంబంధిత విభాగం ఈఈ లేదా ఆపై స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉంటాయి. వాటిని పనుల వారిగా విభజించినప్పుడు సంబంధిత ఏఈల వద్ద మాత్రమే ఉండాలి. ఇవి చోరీకి గురైనా లేదా కనిపించకుండా పోయినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎంబీలో పనులకు సంబంధించిన వివరాలు రికార్డు చేసిన తరువాతే బిల్లులు మంజూరు చేస్తారు. కానీ నిర్మాణాలకు సంబంధించిన ఎంబీలు పోతే సంబంధిత నిర్మాణ వివరాలు అధికారుల వద్ద ఉండే అవకాశం లేదు. దీనివల్ల అదనంగా డబ్బు కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని తెలుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఎంబీలు మాయం అయ్యాయంటే అత్యంత కీలకమైన పనులకు సంబంధించినవే అయి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత సంవత్సరమే ఎంబీలు గల్లంతయినా సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అదికారులు. బల్దియాలో వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్మాణాలు జరుపుతున్నారు. స్మార్ట్ సిటీ, అమ్రుత్ వంటి స్కీంలకు సంబంధించిన నిధులతో పనులు సాగుతున్నాయి. వీటికి సంబంధించిన ఎంబీలా లేక మరో వర్క్స్‌కు సంబంధించినవా అన్నది తేలాల్సి ఉంది. కానీ అసలు ఎంబీలు గల్లతంయ్యాయన్న విషయాన్నే పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ విభాగం అధికారులు దాచిపెట్టారంటే ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై సంబంధిత శాఖకు సంబంధించిన ఓ ఉద్యోగి నేరుగా ఈఈకి లేఖ రాశారు. ఈ లేఖ బయటకు రావడంతో ఎంబీల మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో గల్లంతైన ఎంబీల గురించి కనీసం శాఖ పరంగా కూడా విచారణ చేపట్టడం కానీ, పోలీసులకు ఫిర్యాదు కానీ చేయకపోవడం కూడా అనుమనాలకు తావిస్తోంది.



Next Story

Most Viewed