పట్టణ ప్రగతితో పరిశుభ్రతకు పెద్దపీట : మేయర్ విజయలక్ష్మి

by  |
hyd mayor
X

దిశ, సిటీ బ్యూరో : పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో పరిశుభ్రతకే పెద్దపీట వేశామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి రెండో రోజు శుక్రవారం కూడా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలోని పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం ప్రసంగించారు. పది రోజులు చేపట్టాలనుకున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాల్ని చేపట్టామన్నారు. మొక్కలు నాటడం, చెత్త కుప్పలు తొలగించటం, రోడ్లపై ఉన్న వ్యర్థాలను తొలగించటం, దోమల నివారణ, అంటు వ్యాధుల నివారణ ఇతరాత్ర ముఖ్యమైన కార్యక్రమాలను ఈ పట్టణ ప్రగతిలో చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. వర్షకాలం కారణంగా దోమల నివారణకు జీహెచ్ఎంసీ అన్ని రకాల చర్యలను చేపట్టిందన్నారు.

ఇదే కార్యక్రమంలో భాగంగా నిర్వహించే హరితహారం కార్యక్రమం కింద ఈ సారి కోటిన్నర మొక్కలను నాటే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు వాటిని పరిరక్షించుకునే చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. భావి తరాలకు కాలుష్య రహితమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి అంటే నగరవాసులందరి అభివృద్ది అన్ని విషయాన్ని గుర్తించి ఈ కార్యక్రమంలో అందరూ ఉద్యమ స్పూర్తితో పాల్గొనాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో వివిధ రకాల పనులను చేపట్టి, వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు 900 బృందాలను సిద్దం చేశామని మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు.

Next Story

Most Viewed