హైదరాబాద్ మెట్రోకు భారీ షాక్..

by  |
హైదరాబాద్ మెట్రోకు భారీ షాక్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : నగర ప్రజలకు అత్యంత సౌకర్యం, వేగవంతంగా సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్​మెట్రోపైనా కరోనా ప్రభావాన్ని చూపిస్తోంది. గతేడాది కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో రాత్రి పూట కర్ఫ్యూ ప్రభావంతో సర్వీసులు తగ్గించారు. కొవిడ్​ జాగ్రత్తలతో పరిమిత సర్వీసులు నడుపుతున్నా.. ప్రయాణీకుల సంఖ్య కూడా భారీగా తగ్గిన నేపథ్యంలో మెట్రో ఆర్థిక కష్టాల్లోకి జారుకుంటుంది.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాత్రి పూట కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో మెట్రో కూడా తన సర్వీసుల సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం ప్రారంభం సమయంలో మార్పులు చేయకపోయినా.. రాత్రి 7.45 గంటలకు మెట్రో చివరి రైల్​బయలు దేరి రాత్రి 8.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకోవడంతో మెట్రో సేవలు ఆ రోజుకు ముగుస్తాయి. గతంలో 9.30 గంటలకు చివరి ట్రైన్​ఉండగా.. రాత్రి 11 గంటలకు మెట్రో స్టేషన్లు పూర్తిగా క్లోజ్​ చేసేవారు. మెట్రో ప్రారంభించిన కొత్తలో పెద్దగా స్పందన లభించకపోయినా.. రోజులు గడిచేకొద్దీ ప్రయాణీకుల సంఖ్య భారీగానే పెరిగింది.

మెట్రో రికార్డుల ప్రకారం గరిష్టంగా రోజుకు నాలుగు లక్షల మంది ప్రయాణీకులు మెట్రో సేవలను ఉపయోగించుకున్నారు. తర్వాత లాక్​డౌన్​విధించడంతో మెట్రోపై ఆ ప్రభావం గట్టిగానే కనిపించింది. సుమారు ఐదు నెలల పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. అప్పటికే వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్టు మెట్రో అధికారులు చెబుతున్నారు. అన్ లాక్ తర్వాత మెల్లమెల్లగా రద్దీ పెరుగుతున్నట్టు కనిపించినా.. మళ్లీ నైట్​ కర్ఫ్యూ, పాజిటివ్​ కేసుల సంఖ్యలో పెరుగుదల మెట్రోపై ప్రభావం చూపుతోంది.

తగ్గిన ప్రయాణీకులు.. మూడో వంతకు ఆదాయం

నగరంలో కొవిడ్​పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మెట్రో ప్రయాణీకులు జంకుతున్నారు. అన్ లాక్ తర్వాత సగటున రెండు లక్షల వరకూ ప్రయాణీకులు ప్రయాణించారు. ఈ ఏడాది వేసవి ప్రారంభం కావడంతో ఆ సంఖ్య మరింతగా పెరుగుతుందని మెట్రో వర్గాలు భావిస్తున్న తరుణంలో సెకండ్ వేవ్ రూపంలో మరో పిడుగు పడింది. పబ్లిక్ బయటికి రావడానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మెట్రో రైల్వే స్టేషన్లు, మాల్స్‌లలో ఏర్పాటు చేసిన షాపుల ద్వారా కూడా 45 శాతం ఆదాయం లక్ష్యంగా నిర్ణయించింది. రద్దీ తగ్గడంతో ఈ ప్రభావం వ్యాపార సముదాయాలపై పడుతోంది.

ఐటీ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోమ్ కూడా ఇస్తుండటంతో మెట్రో ప్రయాణీకుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. మెట్రో రైల్ నిర్వహణ వ్యయం కూడా రాని పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని నిర్వహణ సంస్థ ఆందోళనలో ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మెట్రోకు రూ. 318 కోట్ల ఆదాయం రాగా, 2019-20లో రూ. 598కోట్లు వచ్చింది. 2020-21లో వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా అది మూడు వందల కోట్ల లోపే వచ్చినట్టు తెలుస్తోంది. రెండోసారి కరోనా ప్రభావంతో మెట్రో ఆదాయంపై ప్రభావం పడనుంది.



Next Story

Most Viewed