లేడీ కిలాడీ.. మాటువేసి భారీగా నగదు, బంగారం చోరీ

by  |
లేడీ కిలాడీ.. మాటువేసి భారీగా నగదు, బంగారం చోరీ
X

దిశ, పరిగి : పరిగి మున్సిపల్ పరిధిలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. బాధిత కుటుంబీకులు, కొడంగల్ సీఐ ఎ.అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి టీచర్స్ కాలనీకి చెందిన పుల్యానాయక్ ఇంట్లో ఎలక్ర్టీషియన్‌గా పనిచేసే ఓ వ్యక్తి అతని భార్య అద్దెకు ఉంటున్నారు. వీరికి బీటెక్ చదువుతున్న కుమారుడు ఉన్నాడు. బీటెక్‌లో అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు కష్టపడి 1.50 లక్షల నగదు దాచుకున్నారు. వీరితో టీచర్స్ కాలనీలో మంజుల అలియాస్ పాతిమా అనే మహిళ కొంతకాలంగా పరిచయం పెంచుకుంది.

ఇదిలా ఉండగా మంగళవారం తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడం, కొడుకు కూడా ఇంటికి తాళం వేయకుండా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడంతో.. అక్కడే మాటు వేసిన ఫాతిమా మరో ఇద్దరితో కలిసి చోరికి పాల్పడ్డారు. బీరువా తాళం తీసి అందులో ఉన్న 1.50 లక్షల నగదు, 4.9 తులాల బంగారు ఆభరణాలను దొంగలించారు. బయటకు వెళ్లిన వారి కుమారుడు ఇంటికి తిరిగి వచ్చే సరికి బీరువా తెరిచి ఉండటం చూసి కంగారు పడ్డాడు. తన ఫీజు కోసం తెచ్చిన రూ.1.50 లక్షల, 4.9 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు తల్లిదండ్రులకు కొడుకు తెలిపారు.

దీంతో తల్లిదండ్రులు.. స్థానిక కౌన్సిలర్ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కొడంగల్ సీఐ అప్పయ్య తన సిబ్బందితో కలిసి పరిగి చేరుకున్నారు. దొంగతనం జరిగిన ఇంట్లో డీఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. పరిగిలోని బస్టాండ్, కొడంగల్ చౌరస్తా, మిట్టకోడూర్‌తోపాటు పరిగి మున్సిపల్‌లో నాలుగు గంటల పాటు శ్రమించి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. దొంగలించిన డబ్బులతో పరిగిలోని ఓ జ్యూవెలరీ షాపులో బంగారం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story

Most Viewed