ఏపీలో ఏరులై పారుతున్న తెలంగాణ మద్యం

by  |
ఏపీలో ఏరులై పారుతున్న తెలంగాణ మద్యం
X

దిశ, నల్లగొండ క్రైం: సరిహద్దు ప్రాంతాలైన మిర్యాలగూడ, నల్లగొండ పట్టణాలనుంచి రైలు మార్గాన విచ్చలవిడిగా ఆధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం రవాణా అవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల కళ్లుగప్పి మద్యంమాఫియా గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతును కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సీఎం అయిన వెంటనే మందు బాబులకు షాక్ ఇచ్చారు. ఎన్నికలముందు మద్యపాన నిషేధానికి ఇచ్చిన హామీ మేరకు దాదాపుగా పాత కంపెనీల మద్యం ఆ రాష్ట్రంలో లేకుండా చేశారు. కొత్త కంపెనీల మద్యం, దానికి తగ్గట్టుగానే ధరలు కూడా అధికంగా పెంచారు. దీంతో ఆ రాష్ట్రంలోని ప్రజలంతా సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ నుంచి వారికి నచ్చిన విధంగా సరఫరా చేసుకుంటున్నారు. రోడ్డు మార్గాన మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తూ, సరిహద్దు పోలీస్ స్టేషన్లలో లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని సీజ్ చేశారు. లాక్ డౌన్ అనంతరం రైళ్ల రాకపోకలు నెమ్మదిగా పెరగడంతో ఆ మాఫియా రైళ్లలో గుట్టుచప్పుడుకాకుండా ప్రతిరోజూ రూ.లక్షల విలువైన లిక్కర్ ఏపీకి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

గంటలోనే.. గమ్యానికి..

హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ఏపీకి బయలుదేరే రైళ్లన్నీ నల్లగొండ మిర్యాలగూడ రైల్వే స్టేషన్లకు సాయంత్రం సమయానికి చేరుకోవడంతో, లిక్కర్ మాఫియా రైల్లే స్టేషన్ల దగ్గరలో ఉన్న వైన్స్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి, బ్యాగుల్లో రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉంటారు. తీరా రైలు కూత వినపడగానే జనరల్ బోగిలోకి ప్రయాణికుల లగేజీలతోపాటు, వారు సరఫరా చేయాలనుకున్న మద్యాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా అందులో వేస్తారు. తెలంగాణా సరిహద్దు ప్రాంతాలైన దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి లాంటి పట్టణాల్లోకి రైలు చేరుకోవడానికి కేవలం గంటనుంచి గంటన్నార సమయం మాత్రమే పడుతుంది. రైల్వేస్టేషన్లలో నిఘాఅంతంత మాత్రమే ఉంటడంతో మద్యాన్ని తేలికగా రవాణా చేస్తున్నారు.

నల్లగొండ రైల్వేస్టేషన్ కు కూతవేటు దూరంలో మద్యం దుకాణాలు ఉండటంతో మాఫియాకు కలిసొచ్చింది. మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకునే రైళ్లలో వచ్చి దాదాపు ఒకొక్కరూ రూ.40 నుంచి 50వేల వరకూ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ దందా వెనుక లిక్కర్ షాపుల నిర్వాహకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఓ సాధారణ కోటర్ మద్యం సీసా ధర రూ.200లు ఉంటే అదే సీసాను ఆంధ్రలో రూ.350 వరకూ విక్రయిస్తున్నారు. కాగా, నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాలనుంచి ఆంధ్రాకు సరఫరా చేసే వ్యాపారులు రూ.200 ధర ఉన్న సీసాకు 50 నుంచి రూ70ల వరకూ, ఫుల్ బాటిల్ పైనా రెండువందలు అధనంగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ప్యాక్ చేసి బ్యాగులను ఆటోల్లో రైల్వే స్టేషన్ కు చేరుకుని రైలు కూత వినపడగానే ప్రయాణికుల్లో కలిసి జారుకుంటున్నారు.

మూడు ఫుల్లలకు అడ్డుకట్ట..

ఏపీలో మందు నేషేధించాలని జగన్, లిక్కర్ రేట్లు అధికంగా పెంచి మద్యం ప్రియులనోటికి తాళం వేశారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే మద్యాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించడంతో 410 జీవో ప్రకారం హైకోర్టు మూడు ఫుల్ బాటిళ్లను తీసుకుపోవచ్చని తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఆ తీర్పును సవాల్ చేస్తూ మూడు ఫుల్ బాటిళ్లకు కూడా అనుమతులు లేవంటూ ఎక్సైస్ శాఖద్వారా 310 జీవోను జారీచేయించి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని నిషేధించింది.

కొరవడిన పోలీసుల నిఘా..

రైళ్ల ద్వారా విచ్చలవిడిగా మద్యం సరఫరా అవుతున్నా గుంటూరు, నల్లగొండ జిల్లా పోలీసులు, ఎక్సైస్ శాఖ నిఘా కొరవడింది. వైన్స్ నిర్వాహకులు, మద్యం మాఫియా కలిసి బెల్ట్ తీస్తున్నారు. లక్షల్లో చేతులు మారుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని హాలియా, ముకుందాపురం, నిడమనూరు, నాగార్జున సాగర్, దామరచర్ల, సూర్యాపేట జిల్లాలో కోదాడ, తదితర ప్రాంతాలనుంచి రోడ్డు మార్గాన మద్యం సీసాలను సరఫరా చేస్తున్నారని సమాచారం. ఆంధ్రాకు ప్రధాన చెక్ పోస్టులైన నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్, వాడపల్లి, సూర్యాపేట జిల్లాలో కోదాడ మండలం రామాపురం ప్రాంతాలనుంచి మద్యం ప్రియులు తెలంగాణకు వచ్చి మద్యంసేవించి వెళుతూ పోలీసులు వెంటపడటంతో ప్రాణాలు కోల్పోయి, తీవ్రగాయాలైన సంఘటనలూ ఉన్నాయి. ఏడాదిక్రితం ఆంధ్రాప్రాతానికి చెందిన ఓ రైతు రామాపురం చెక్ పోస్టు దాటి కోదాడలో మద్యం సేవించి జగ్గయ్యపేటకు వెళుతూ, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న పోలీసులను తప్పించుకోవాలని ప్రయత్నించి బైక్ పైనుంచి కిందపడి మృతిచెందాడనే వార్తలు వినిపించాయి.

నాగార్జునసాగర్ నియోజకర్గంలో నకిలీ మద్యం తయారీ..?

సాగర్ నియోజకర్గంలో నకిలీ మద్యం తయారీ చేస్తున్నారని మద్యం ప్రియులనుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా పరిసర ప్రాంతాల్లో ఒక్కోసారి మద్యం కల్తీ అయ్యి వస్తోందని చెబుతున్నారు. అయితే అక్కడ నల్లమల ఫారెస్టు వేల ఎకరాల్లో విస్తరించి ఉండడం, బత్తాయి తోటలు అధికంగా ఉండడం వల్ల ఆయా పరిసరాల్లోనే భారీగా కల్తీ మద్యం తయారవుతోందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తంతు అంతా అధికారులకు తెలిసే జరుగుతోందని ప్రజల నుంచి ఆరోపణలు వినపిస్తున్నాయి. ఉపఎన్నికలో ఈ మద్యాన్ని ఓటర్లకు చేరవేస్తే అధికసంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడనున్నారు. ఆ ప్రాంతాల్లో ప్రతి వైన్స్ షాపుల్లో ఉన్న లిక్కర్ షాంపిల్స్ తీసుకుని ల్యాబ్ లో టెస్టులు చేయించాల్సిన అవసరం ఉంది.


Next Story