ఆ శాఖలో ఆగని అక్రమాలు.. అడ్డుకట్టేదెవరు..?

by  |
ఆ శాఖలో ఆగని అక్రమాలు.. అడ్డుకట్టేదెవరు..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆయన సంఘాల నేతలు, వారిపట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు జరిగే అన్యాయంపై ఎలుగెత్తాల్సినవారే కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికార యంత్రాంగంతో కుమ్ముక్కై అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇందుకు నిదర్శమే ఇటీవల జలవనరుల శాఖలో జరిగిన ఆప్షనల్ కేటాయింపుల పర్వమనే వ్యాఖ్యలు ఉద్యోగవర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇరిగేషన్ సెక్టర్‌కు సంబంధించి వేర్వేరుగా ఉన్న విభాగాలన్నీ ఇటీవల ఒకే గొడుగు కిందకు తెచ్చారు. జలవనరుల శాఖగా నామకరణం చేశారు.

టెరిటోరియల్ యూనిట్లకు..

ఆయా విభాగాల్లో ఉన్న సిబ్బందిని టెరిటోరియల్ యూనిట్లకు విభజించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేటాయింపులు జరుగగా, సేవా సౌలభ్యం కోసం కొద్ది రోజుల క్రితం ఆప్షనల్ అలాట్మెంట్‌కు అవకాశం కల్పిస్తూ, జలవనరుల శాఖ సర్కలర్ విడుదల చేసింది. టెరిటోరియల్ యూనిట్ పరిధిలోని సర్కిల్‌లో సిబ్బంది ఎంచుకున్న ప్రాధాన్యత క్రమం, సీనియారిటీ , కేటగిరిని బట్టి కేటాయింపులు చేయాల్సి ఉంది. కాగా, ఇక్కడే ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుపెట్టారు. తాము సూచించిన వ్యక్తికి, సూచించిన చోట మాత్రమే అవకాశం కల్పించాలంటూ, ఉన్నతాధికారులతో ఒప్పందం చేసుకుని, చక్రం తిప్పినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఆప్షనల్ కేటాయింపుల్లో..

ఆప్షనల్ కేటాయింపుల్లో కూడా నిర్దేశిత నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగుల సీనియారిటీ, మెడికల్ గ్రౌండ్, హెడ్ క్వార్టర్ అంశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, వీటికి మంగళం పాడి, ఇష్టారాజ్యంగా కేటాయింపులు జరిపినట్లు, సంఘ నాయకుల సూచన మేరకే అధికారులు నడుచుకుంటున్నారని వాపోతున్నారు. అటెండర్ , జూనియర్ అసిస్టెంట్ , రికార్డు అసిస్టెంట్ , సీనియర్ అసిస్టెంట్ లు యూనిట్ లెవెల్ పోస్టులు కాగా, సూపరింటెండెంట్, నాన్-టెక్నికల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు, టెరిటోరియల్ యూనిట్ కింద పరిగణించబడతాయి. అయితే, ప్రస్తుత కేటాయింపుల్లో సూపరింటెండెంట్ నుంచి ఎన్టీపీఏ వరకు స్థానిక జిల్లాలోనే ప్రాధాన్యత ఇవ్వగా, ఇక జిల్లా క్యాడర్ పోస్టులను కలిగిన ఉద్యోగులను టెరిటోరియల్ యూనిట్ పరిధి దాటి అలాట్మెంట్ చేశారు. తమకు అనుకూలంగా ఉండే వారికి మాత్రమే కోరుకున్న చోట కేటాయిస్తూ, మిగతావారి అర్హతలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.

అలాట్మెంట్లలో అక్రమాలు..

చిన్న నీటి పారుదల, మధ్య తరహా, భారీ నీటి పారుదల శాఖలను మెర్జ్ చేయటం మూలంగా పదోన్నతుల్లో నష్టపోయే అవకాశాలున్డగా, అప్సనల్ అలాట్మెంట్లలో జరుగుతున్న అక్రమాలతో తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆవేదన వెల్లువెతుతోంది. తమకు జరిగిన అన్యాయంపై సంఘం నాయకులను నిలదీస్తే, బెదిరింపులకు పాల్పడుతూ, దిక్కున్నచోట చెప్పుకోండంటూ సెలవిస్తున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ అక్రమాల వెనుక పెద్ద ఎత్తున చేతులు మారినట్లు ఆరోపణలు వస్తుండగా, తమకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు కోర్టు గుమ్మం తొక్కగా, వీరి బాటలోనే మరికొంత మంది నడుస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed