వెహికిల్ ఇన్సూరెన్స్ పేరుతో భారీ మోసాలు

by Vadlamudi Anukaran |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వనరుల్లో రవాణా శాఖ కీలకం. అలాంటి రవాణా శాఖలో నకిలీ బీమాలు జోరుగా సాగుతున్నాయి. యేడాదికోసారి చేయించే బీమాల జారీలో కొందరు ఏజెంట్లు చూపిస్తున్న చేతివాటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బీమా ప్రీమియం ధర కంటే 50 శాతం తక్కువ రేటుకే ఇస్తున్నట్లు చెప్పి వాహనదారులను మోసం చేస్తున్నారు. వాహనదారులు ఏ కంపెనీకి చెందిన బీమా బాండ్ అడిగితే వారికి నిమిషాల్లోనే బీమా పత్రాలను అందజేస్తున్నారు. ఒక్క బీమా [&hellip;]</p>

వెహికిల్ ఇన్సూరెన్స్ పేరుతో భారీ మోసాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వనరుల్లో రవాణా శాఖ కీలకం. అలాంటి రవాణా శాఖలో నకిలీ బీమాలు జోరుగా సాగుతున్నాయి. యేడాదికోసారి చేయించే బీమాల జారీలో కొందరు ఏజెంట్లు చూపిస్తున్న చేతివాటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బీమా ప్రీమియం ధర కంటే 50 శాతం తక్కువ రేటుకే ఇస్తున్నట్లు చెప్పి వాహనదారులను మోసం చేస్తున్నారు. వాహనదారులు ఏ కంపెనీకి చెందిన బీమా బాండ్ అడిగితే వారికి నిమిషాల్లోనే బీమా పత్రాలను అందజేస్తున్నారు. ఒక్క బీమా చేయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి దాదాపు 80 శాతం రుసుం వెళుతుంది. దీనితో పాటు మరో 10 శాతం రుసుం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. అంతేకాదు ఎవరైనా ప్రమాదంలో చనిపోయినప్పుడు డబ్బు క్లెయిమ్ చేసుకోవాలనుకున్నప్పుడు అవి నకిలీవని తేలుతున్నాయి. దీంతో వారి కుటుంబసభ్యులు కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

బార్ కోడ్లనూ మార్చేస్తున్నారు

బీమా కంపెనీలు తాము జారీచేసిన బాండ్లలో బార్ కోడ్లను ఏర్పాటు చేస్తాయి. దీనిని గుర్తించిన అక్రమార్కులు బార్ కోడ్లు, సీరియల్ నెంబర్లను సైతం మార్చేసి అమ్మేస్తున్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీ సమయంలో బార్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా వారి వాహన వివరాలు, ప్రీమియం చివరి తేదీకి సంబంధించిన వివరాలు చూస్తుంటారు. కానీ కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రీమియం నెంబర్‌ను సెర్చ్ చేస్తే తెలుస్తుంది, అది అసలైనదా.. నకిలీదా అని. ఇలాంటి నేరాలు చేస్తున్న ముఠాను కొన్ని రోజుల క్రితమే సైబర్ పోలీసులు పట్టుకున్నారు. రిజిస్ట్రేషన్, పొల్యూషన్ చెక్ కోసం వచ్చే వారిని క్యాచ్ చేసుకొని రూ.పది వేల బీమాను రూ.రెండు వేలకే అందిస్తామని చెప్పి కొన్ని వందల మందికి బైక్, ఆటో, కార్, ట్రక్ వాహనదారులకు బీమాలు అమ్మినట్లు నిందితులు వెల్లడించారు. వారి దగ్గర నుంచి 1,125 నకిలీ బీమా కాపీలను స్వాధీనం చేసుకున్నారు.

వాహనదారుల్లో మార్పు రావాలి

ప్రమాదాలు జరిగినప్పుడే బీమా విలువ తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ వాహనానికి బీమా చేయించుకోవాలి. ప్రభుత్వం ఎన్ని విధాలుగా వీటిని నియంత్రించాలని ప్రయత్నించినా.. ప్రజల్లో మార్పు వస్తేనే నిర్మూలించడం సాధ్యం. వాహనం నెంబర్‌తోనే బీమా గురించి పూర్తి వివరాలు తెలియజేసేలా బీమా కంపెనీలు రవాణా శాఖతో అనుసంధానం అవ్వాలి. నకిలీ బీమాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. – పురుషోత్తం, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, వరంగల్

Next Story