తిరిగి డీజిల్ సెగ్మెంట్‌లోకి మారుతీ సుజుకీ !

by  |
తిరిగి డీజిల్ సెగ్మెంట్‌లోకి మారుతీ సుజుకీ !
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తిరిగి డీజిల్ సెగ్మెంట్‌లోకి రావాలని ఆలోచిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎస్‌యూవీ, మల్టీ పర్పస్ వాహనాల విభాగాల్లో డీజిల్ వెర్షన్‌లకు డిమాండ్ అధికంగా ఉండటంతో కంపెనీ తప్పనిసరై ఈ సెగ్మెంట్‌కు మళ్లీ రావాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా బీఎస్6 నిబంధనలు అమలైన తర్వాత డీజిల్ వాహనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం డీజిల్ వెర్షన్‌లను డిమాండ్ ఉండటంతో ఇప్పటికే తమ ఉత్పత్తి ప్లాంట్‌లో బీఎస్6 డీజిల్ ఇంజిన్‌ల తయారీని ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి విటారా బ్రెజా, ఎర్టిగా మోడళ్లలో ఈ డీజిల్ సెగ్మెంట్ వాహనాలను తీసుకురావాలని, వచ్చే సంవత్సరం పండుగ సీజన్ సమయానికి ఉత్పత్తిని మొదలు పెట్టనున్నట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీజిల్ ఇంజిన్ తయారీలో 1500సీసీ సామర్థ్యం కలిగిన వాటిని తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

‘బీఎస్6 డీజిల్ కార్లకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటే గనక తాము బీఎస్6 డీజిల్ వెర్షన్ కార్లను వీలైనంత తక్కువ వ్యవధిలో అభివృద్ధి చేస్తామని’ మారుతీ సుజుకి ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఏడాది జులైలో డీజిల్‌తో నడిచే ఎస్‌యూవీ, సెడాన్‌లలో డీజిల్ వాహనాలకు డిమాండ్‌ను బట్టి కంపెనీ బీఎస్6 డీజిల్ ఇంజిన్ తయారీని చేపట్టవచ్చని శశాంక్ శ్రీవాస్తవ చెప్పిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed