మరోసారి ధరలు పెంచిన మారుతి సుజుకి.. ఏ ఏ మోడళ్లపై ఎంతంటే..?

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి.. వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు కార్ల ధరలను పెంచిన కంపెనీ తాజాగా మరోసారి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మారుతి సుజుకి అత్యంత ఆదరణ కలిగిన స్విఫ్ట్ మోడల్ సహా సీఎన్‌జీ వేరియంట్లపై ఈ ధరల పెంపు అమలవుతుందని కంపెనీ ప్రకటించింది. వాహనాల తయారీలో కీలకమైన ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిపోతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. గత నెలలో ధరల పెంపు ఉంటుందని ప్రకటించిన కంపెనీ ఏ ఏ మోడళ్లపై, ఎంతమేర పెంపు ఉంటుందని స్పష్టం చేయలేదు.

సోమవారం దీనిపై స్పష్టత ఇస్తూ స్విఫ్ట్ మోడల్ సహా అన్ని సీఎన్‌జీ వేరియంట్ల ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. ఎక్స్‌షోరూమ్ ధరపై రూ. 15 వేలను పెంచుతున్నామని, పెరిగిన ధరలు సోమవారం(జూలై 12) నుంచే అమలవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. స్విఫ్ట్ మోడల్ కాకుండా ఎర్టిగా, ఆల్టో, ఎక్స్‌ప్రెసో, వ్యాగన్ ఆర్, ఎకో, సెలెరియా మోడళ్లలోని సీఎన్‌జీ కార్లపై ఈ పెంపు ఉంటుంది. మారుతి సుజుకిలో ఎక్కువగా అమ్ముడవుతున్న మోడళ్లపైనే ఈ ధరలు పెరగడం గమనార్హం. కాగా, కంపెనీ ధరల పెంపు నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి షేర్ ధర దాదాపు 1 శాతం లాభపడింది.



Next Story

Most Viewed