ప్రేమన్నాడు.. ఉద్యోగం ఊడగొట్టాడు.. భర్త కోసం 24 రోజులుగా వివాహిత అక్కడే..!

by  |
ప్రేమన్నాడు.. ఉద్యోగం ఊడగొట్టాడు.. భర్త కోసం 24 రోజులుగా వివాహిత అక్కడే..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఓ వైపున చలి చంపుతున్నా ఆ అతివ మాత్రం తన పంథాన్ని వీడడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని తాళి కట్టిన భర్తకే భార్యగా ఉంటానంటూ భీష్మించుకుని కూర్చుంది. ఏకంగా 24 రోజుల నుంచి అత్తారింటి ముందు కూర్చుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. బాధితురాలు సుహాసిని కథనం ప్రకారం… కడప జిల్లాకు చెందిన తనకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన సుజిత్‌తో ప్రేమ వివాహం జరిగింది. కానీ తన భర్త మెట్టింనింటికి మాత్రం తీసుకెళ్లడం లేదు. 2018లో కువైట్‌లో ఉన్న తనను ఇండియాకు రప్పించి వివాహం చేసుకుంటానని చెప్పాడు. చివరకు గతేడాది నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు.

ఈ సమయంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిపోయిన నన్ను అత్తింటివారు ఆదరించడం లేదని సుహాసిని ఆవేదన వ్యక్తం చేసింది. గత 24 రోజులుగా అత్తింటి ఎదుట కూర్చుని నిరసన తెలుపుతున్నా కనికరించడం లేదని వాపోయారు. పైగా ఇంటి ముందు నుండి వెళ్లిపోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని సుహాసిని ఆరోపించారు. గతంలో తనను కాపురానికి తీసుకెళ్తానని బాండ్ పేపర్ కూడా రాసిచ్చారని గుర్తుచేశారు. అయినప్పటికీ తనను అత్తింటి వారు పట్టించుకోవడం లేదని వాపోయింది సుహాసిని. ప్రేమ వివాహం కారణంగా కువైట్‌లో ఉద్యోగం వదులుకుని వస్తే భర్త తనకు ఏ మాత్రం సహకరించడం లేదని తెలిపింది. తనకు న్యాయం జరగలేదన్న కారణంగా క్రిమినల్ కేసు నమోదు చేశానని అయినప్పటికీ అత్తింటి వారి నుండి స్పందన లేదన్నారు. దీంతో కాపురానికి తీసుకెళ్లాలని వేడుకుంటూ అత్తింటి ముందు నిరసన తెలుపుతున్నట్టు బాధితురాలు సుహాసిని కంటనీరు తెచ్చుకుంది. పోలీసు అధికారులు చొరవ తీసుకుని తన కాపురాన్ని నిలబెట్టాలని సుహాసిని కోరుతోంది.


Next Story

Most Viewed