ఆడపిల్ల పుట్టిందని వేధింపులు.. ఆ మాతృమూర్తి చివరికి ఏం చేసిందంటే..!

by  |
ఆడపిల్ల పుట్టిందని వేధింపులు.. ఆ మాతృమూర్తి చివరికి ఏం చేసిందంటే..!
X

దిశ, వెబ్‎డెస్క్ : ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మి దేవి పుట్టిందని ఎంతో ఆనందపడే వ్యక్తులు ఉన్న నేటి సమాజంలో, ఆడపిల్లకు జన్మనిచ్చిందని ఓ తల్లిని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తులు లేకపోలేరు. ఆడపిల్లలు సైతం పురుషులకు దేనిలో తీసిపోకుండా ఉన్నతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ఆడపిల్ల పుట్టిందని అసంతృప్తితో ఆ ఆడపిల్లకు జన్మనిచ్చిన మాతృమూర్తిని కొందరు భర్తలు వేధింపులకు గురిచేస్తున్నారు. అలాంటి ఘటనే కామారెడ్డిలో చోటు చేసుకుంది.

12 యేళ్ల క్రితం కామారెడ్డి జిల్లాకు చెందిన వడ్ల నాగమణి, సంజీవులు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరూ ఆడపిల్లలే. పెద్దమ్మాయి భవిత(11), చిన్నమ్మాయి లాస్య (యేడాదిన్నర) ఉన్నారు. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి ఈ మ‌ధ్య తిరిగి వచ్చిన సంజీవులు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని నాగమణిని రోజు వేధించేవాడు. దీంతో నాగ‌మ‌ణి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో… వారు ఎంతో నచ్చజెప్పిన వినలేదు.

అయితే నాగమణి ఇటీవల తన తల్లి తో ఫోన్లో మాట్లాడడం చూసిన సంజీవులు మీ అమ్మకు ఎందుకు ఫోన్ చేశావ్ అంటూ నాగమణితో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన నాగమణి ఆరోజు రాత్రి అందరు పడుకున్నాక ఇంటి నుంచి బయటకు వెళ్లిన నీటి మడుగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆడపిల్లలు పుట్టారని అల్లుడు వేధింపులకు గురి చేసినందుకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని నాగమణి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed