దాడులతో మావోయిస్టులు ఏం సాధించలేరు.. కిషన్ రెడ్డి

by  |
దాడులతో మావోయిస్టులు ఏం సాధించలేరు.. కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో బీజేపీ లేని రాజకీయ వ్యవస్థను ప్రజలు ఊహించుకోలేరని, ప్రజా సమస్యలపై తమ పార్టీకి ఉన్న చిత్తశుద్దే వారి మనసుల్లో చెరగని ముద్ర వేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం బీజేపీ పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు రెండు స్థానాలున్న బీజేపీ.. 303 స్థానాలకు ఎదగడం కార్యకర్తల కృషి ఫలితమే అన్నారు. అధికారం కోసం బీజేపీ ఎప్పుడు పాకులాడలేదని, మాజీ ప్రధాని వాజ్ పేయ్ కేంద్రంలో తమ ప్రభుత్వం పడిపోతుందని తెలిసి కూడా ఎలాంటి బేరసారాలకు దిగకుండా ఒక్క ఓటుతో కూలిపోవడం బీజేపీ కమిట్ మెంట్‌కు నిదర్శనమన్నారు. పేద ప్రజల సంక్షేమమే బీజేపీ ప్రధాన ఎజెండా అని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందుతుందన్నారు.

తెలంగాణలో 2023 లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందు కోసం క్షేత్రస్థాయిలో ప్రతీ కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని, బీజేపీ ఒక్కటే టీఆర్ఎస్‌ను నిలువరించగలదన్నారు. తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని, ఆ పాలన అంతం బీజేపీతోనే సాధ్యం అన్నారు.

ఉగ్రవాద చర్యలతో ఏమీ సాధించలేరు..

మావోయిస్టులు ఉగ్రవాద చర్యలతో ప్రజలకు సేవ చేయలేరని, వారు హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మావోయిస్టులు హింసాత్మక చర్యల వల్ల కుటుంబానికి జీవనాధారమైన జవాన్లు అమరులయ్యారు. ఈ సందర్భంగా మరణించిన జవాన్లకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఏఐడీఎంకె విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేకు రౌడీల పార్టీ అని ముద్ర ఉందని, ఆ పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత తగ్గినందున మరోసారి ఎన్నికల్లో భంగపాటు తప్పదన్నారు. తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, స్టూడెంట్స్ సూసైడ్స్ పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.



Next Story